గాన గంధర్వుల గాత్రం అజరామరం
హాజరైన కలెక్టర్ పీవీ గౌతమ్,రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు
ఖమ్మంలో వచ్చేయేడు ఘంటసాల, ఎస్పీ బాలు విగ్రహాల ఏర్పాటు
సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ అధ్యక్షుడు టి.వాసుదేవ్
ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 5 : పాటకు పట్టాభిషేకం చేశారు… ఆ పాత, కొత్త మధుర గీతాలతో ఓలలాడించారు. స్వర్గీయులు, గాన గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రాలు సంగీతభరితంగా మార్మోగాయి. భక్తిచింతన, ప్రేమ, వైరాగ్యం, తత్వం, ఆనంద గీతాల డోలికలు ఊయలలూగాయి.. సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నిర్వహించిన ‘భలే మంచి రోజు’ సుమధుర గానవాహిని శ్రోతలకు వీనుల విందు చేసింది. సినీ నేపథ్య గాయకుడు బీఏ నారాయణ ఆలపించిన ‘ఎవరి కోసం ఎవరి కోసం’ ప్రేమనగర్ పాట, జరిగిన కథలోని ‘భలే మంచి రోజు’ మల్లియలారా.. మాలికలారా, ఎక్కడ ఉన్నా ఏమైనా’ పాటలు ఆహ్లాదభరితం చేశాయి. ‘రాజశేఖరా.. నీపై మోజు తీరలేదు’ అంటూ అనార్కలిలోని పాటను బీఏ నారాయణ, శాంతిశ్రీ మధురాతి మధురంగా ఆలపించి పాటల మోజును పెంచారు. ‘ఈ నల్లని రాళ్లలో అంటూ గాయకుడు నారాయణ అమరశిల్పి జక్కన్నను గుర్తు చేశారు. ఓహో.. మేఘమాల అంటూ భలే రాముడులోని యుగళగీతానికి సరిత, రసూల్బాబు గానామృతాన్ని అందించారు. తకిట తకిట తథిమి తంథానా’ అంటూ గాయకుడు రాము సాగర సంగమం చేశారు. ఇంకా శ్రీకృష్ణ పాండవీయం, సువర్ణ సుందరి, మాయాబజార్, పుణ్యవతి, అగ్గిపిడుగు, జయభేరి, చిల్లరదేవుళ్లు, భార్యాభర్తలు, స్వాతి కిరణం, అన్నమయ్య, గీతాంజలి, సిరివెన్నెల తదితర వందలాది పాటలను ఘంటసాల, ఎస్పీబీ గాత్రాలతో ఆలపించి మంత్రముగ్ధులను చేశారు.
పాత, కొత్త పాటల సంగమంతో శ్రోతలు అలౌకిక అనుభూతికి గురయ్యారు. పాతిక సంవత్సరాలుగా స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సంగీత వేడుకలో ఈ సంవత్సరం స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను కూడా వినిపించి ఆహుతులను రసమయం చేశారు. సంగీత దర్శకులు, సినీ నేపథ్య, రాష్ట్రస్థాయి గాయనీ గాయకులు పలు గీతాలను ఆలపించి గానలోకానికి తీసుకెళ్లారు. ఈ వేడుకలో పాల్గొన్న కలెక్టర్ పీవీ గౌతమ్ మాట్లాడుతూ పాతిక సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మంచి కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలన్నారు. ఒక మంచి సంస్కృతిని అభిమానించే.. ఆదరించే ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు మాట్లాడుతూ బ్రహ్మలోకం నుంచి ఒక తంత్రిగా పడిన గాన సౌందర్యమే ఘంటసాల అని కీర్తించారు. తెలుగు భాష, సాహిత్యం, సంపదను వచ్చే తరాలకు అందించే ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. పాతికేళ్లుగా ఘంటసాల పాటలను అందిస్తున్న భలే మంచి రోజు నిర్వాహకుల కృషిని అభినందించారు. గాన గంధర్వులు ఘంటసాల, ఎస్పీబీల గాత్రాలతో కచేరి చేస్తున్న గాయకుల సేవలు అనన్యమన్నారు. తొలుత ఘంటసాల, ఎస్పీబీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ అధ్యక్షుడు డాక్టర్ టి.వాసుదేవ్ మాట్లాడుతూ ఖమ్మంలో వచ్చే యేడు ఘంటసాల, ఎస్పీ బాలు విగ్రహాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి శఠగోపం సుదర్శన్, పంచాంగం విజయసారథి, దాతలు మహ్మద్ అజీజ్, మహ్మద్ జాన్సాహెబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత అధికారి జీఎల్ఎన్ శాస్త్రి, వినీల, కల్యాణి, అధిక సంఖ్యలో శ్రోతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.