సత్తుపల్లి, డిసెంబర్ 5 : తెలుగు రాష్ర్టాల్లో పుట్టిన కమ్మజాతి యువత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కార్తీకమాసం చివరిరోజు సందర్భంగా కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో వేంసూరు రోడ్డులోని కొత్తూరు మామిడితోటలో ఆదివారం కమ్మవారి వనసమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ తెలుగుజాతి ఔన్నత్యానికి పాటుపడిన ఎందరో కమ్మవారిని ఆదర్శంగా తీసుకుని వారి కీర్తిప్రతిష్టలను మరింత పెంచాలని, సమాజంలో ఉన్నతంగా రాణిస్తూ తోటివారికి సాయం చేస్తూ సమాజసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్మ సంఘానికి జూబ్లీహిల్స్లో ఐదెకరాల విస్తీర్ణంలో విలువైన స్థలాన్ని కేటాయించారని, అక్కడ త్వరలోనే శంకుస్థాపన చేసి కమ్మ సేవాసమితి భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఆధునిక సమాజంలో పోటీతత్వం పెరిగిందని, నేటి యువత, విద్యార్థులు దీనికి దీటుగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మహిళలు ఉసిరిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ వనసమారాధనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కమ్మ సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు యర్నెని రామారావు, తాళ్లూరి జీవన్కుమార్, కమ్మ సేవా సంఘం నాయకులు వాసిరెడ్డి రామనాధం, అన్నమయ్య సంకీర్తనల గాయని కొండవీటి జ్యోతిర్మయి, చలసాని సాంబశివరావు, నాయుడు వెంకటేశ్వరరావు, చల్లగుళ్ల నర్సింహారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, గాదె సత్యం, బాలయ్య, మట్టా అజయ్కుమార్, రవికుమార్, దుర్గాప్రసాద్, సత్యనారాయణ, టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.