పల్లె ప్రగతిలో కిష్టారం ముందంజ
ఆహ్లాదాన్ని పంచుతున్న ‘బృహత్’ వనం, పల్లె ప్రకృతి వనం
రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు
వైకుంఠధామం, డంపింగ్యార్డు పూర్తి
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 4: గతంలో ఆ పల్లె అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అరకొర వసతులతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ఆ గ్రామ రూపురేఖలను మార్చేసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. రహదారుల వెంట పెరిగిన చెట్లు ఆహ్లాదం పంచుతున్నాయి. పల్లె ప్రకృతి వనం, బృహత్ వనంతో మరింత శోభను సంతరించుకుంటున్నాయి. డంపింగ్ యార్డు నిర్మించి ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తూ సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. వైకుంఠధామంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. ఆ గ్రామం ఎక్కడుంది.? జరిగిన అభివృద్ధి తెలుసుకోవాలంటే కిష్టారం గ్రామాన్ని సందర్శించాల్సిందే..
పల్లె ప్రగతి పంచాయతీలక కొత్త కళను తీసుకొచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ కిష్టారం పాలకవర్గం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నది. ప్రస్తుతం పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామం కళకళలాడుతున్నది. గతంలో అశభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం నేడు పల్లె ప్రగతి పనులతో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతి లక్ష్యాలైన వైకుంఠధామం, డంపింగ్యార్డు, ప్లాంటేషన్ పూర్తయింది. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
జరిగిన అభివృద్ధి ఇదీ..
కిష్టారంలో 5,200 జనాభా ఉండగా ఓటర్లు 3,300 మంది ఉన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రూ.7 లక్షలతో కల్వర్టులు, రూ.లక్షలతో చిల్డ్రన్ పార్కు, శిథిలావస్థకు చేరిన పంచాయతీ, సొసైటీ భవనాల నిర్మాణానికి రూ.కోటి నిధులు, రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు అందుబాటులోకి వచ్చాయి. గ్రామంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా బృహత్ వనం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 35 వేలకు పైగా మొక్కలు పెరుగుతున్నాయి. పదెకరాల స్థలంలో బృహత్ ప్రకృతి వనం, నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలోని వైకుంఠధామం చుట్టూ మొక్కలు పెంచడంతో వనాన్ని తలపిస్తున్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. గ్రామంలో ఏర్పాటైన డంపింగ్యార్డుకు పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడుడ తడి, పొడి చెత్త తరలిస్తున్నారు. పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
అభివృద్ధిలో ముందంజ
రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో గ్రామస్తులందరూ భాగస్వాములవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో పంచాయతీని ముందంజలో నిలుపుతాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. గ్రామాన్ని స్వచ్ఛత వైపు నడిపిస్తాం. పల్లె ప్రకృతి వనాన్ని జిల్లాకే ఆదర్శంగా నిలుపుతాం.
ప్రభుత్వ సహకారంతో..
ప్రభుత్వ సహకారంతో పంచాయతీలో ప్రగతి పనులు చేపడుతున్నాం. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేస్తున్నాం. సమర్థంగా పనులు పూర్తి చేస్తున్నాం. గ్రామస్తులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఇంటి, నీటి పన్నుల చెల్లింపుల్లో గ్రామం మండలానికే -కొలపనేని ధనుంజయరావు, ఉప సర్పంచ్, కిష్టారం