సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
గృహావసర సిలిండర్కు రూ.25, వాణిజ్యానికి రూ.75 వడ్డన
ఉమ్మడి జిల్లాలో నెలకు సుమారు రూ.2.86 కోట్ల అదనపు భారం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలు
ఖమ్మం/కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 3: గ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో జనం బెంబేలెత్తి పోతుంటే.. గ్యాస్ బండ భారం సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గ్యాస్ ధరలు చూస్తుంటే మళ్లీ కట్టెల పొయ్యిపైనే వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్కు రూ.25, కమర్షియల్కు రూ.75 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరిగినా, తగ్గినా సబ్సిడీ వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. వినియోగదారులకు కొంత ఊరట కలిగేది. కానీ కొవిడ్ సంక్షోభం నుంచి ధరలు పెరిగినా, తగ్గినా కేవలం రూ.21.50 మాత్రమే సబ్సిడీ రూపంలో వినియోగదారుల ఖాతాల్లో జమ అవుతున్నది. పెరిగిన ధరలతో ఉమ్మడి జిల్లాలో రూ.2 కోట్లకుపైగా అదనపు భారం పడనున్నది.
సామాన్యుని నెత్తిన మళ్లీ ‘గ్యాస్’ బండ పడింది. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ ధరలను అనేకసార్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బుధవారం ధరలు పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్కు రూ.25, కమర్షియల్కు రూ.75 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరిగినా, తగ్గినా సబ్సిడీ వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. దీంతో వినియోగదారులకు కొంత ఊరట కలిగేది. కానీ కొవిడ్ సంక్షోభం వచ్చినప్పటి నుంచి ధరలు పెరిగినా, తగ్గినా కేవలం రూ.21.50 మాత్రమే సబ్సిడీ రూపంలో వినియోగదారుల ఖాతాల్లో జమ అవుతున్నది. పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యులపై భారం మోపుతున్నాయి. ఒకవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించలేని కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలనూ పెంచడంపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ధరల భారం మోపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో నెలకు రూ.2 కోట్లకు పైగా భారం..
చమురు కంపెనీలు ఈ ఏడాది మార్చి, జూలై నెలల్లో గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. ఒకే ఏడాదిలో ముచ్చటగా మూడోసారి సెప్టెంబర్ 1న మరోసారి ధర పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25.50, కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 చొప్పున పెరిగింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 32 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వీటి పరిధిలో 4.10 లక్షల డిమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో లక్ష కనెక్షన్లు ఉండవచ్చు. గత నెల 31 వరకు డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.890 ఉండగా తాజా తీసుకున్న నిర్ణయంతో రూ.915.50కు చేరుకున్నది. ఇలా 5 లక్షల కనెక్షన్లు వారిపై నెల నెలా రూ.1.25 కోట్ల భారం పడనున్నది. గత నెల 31 వరకు వాణిజ్య సిలిండర్ ధర రూ.1,750 ఉండగా ఈనెల 1వ తేదీన కేంద్రం రూ.75 పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం ప్రస్తుతం ఒక సిలిండర్ ధర రూ.1,825కు పెరిగింది. నెలకు వాణిజ్య సిలిండర్ల వినియోగదారులపై రూ.75 లక్షల వరకు భారం పడుతుంది. ఇలా గృహ, వాణిజ్య సిలిండర్లకు నెలకు మొత్తం రూ.2 కోట్లకుపైగా అదనపు భారం పడనున్నది.
భద్రాద్రిలో నెలకు సుమారు రూ.86 లక్షల భారం..
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 3.39 లక్షల గృహావసర కనెక్షన్లు ఉన్నాయి. తాజాగా గృహావసర సిలిండర్ ధర రూ.25 పెరగడంతో నెలకు వినియోగదారులపై రూ.84 లక్షల భారం పడనున్నది. అలాగే జిల్లావ్యాప్తంగా 2,319 కమర్షియల్ కనెక్షన్లు ఉండగా తాజాగా కేంద్రం రూ.75 పెంచింది. ఈ చొప్పున వినియోగదారులపై నెలకు 1.71 లక్షల భారం పడనున్నది.
అన్యాయంగా ధరల పెంపు..
కేంద్ర ప్రభుత్వం సాంతం గ్యాస్ ధరలు పెంచుతున్నది. ధరలతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు నష్టం కలుగుతున్నది. పేదోళ్లను ఆదుకుంటామని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు పేద ప్రజలకు ఏమీ చేయడం లేదు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యులకు అన్యాయం చేస్తున్నారు. – చిలుకూరి రమాదేవి ,గృహిణి ఖమ్మం
పేదోళ్లు ఎలా బతకాలి..?
పేద మధ్యతరగతి ప్రజల గురించి కేంద్రం ఆలోచించడం లేదు. కేంద్రం ముఖ్యమైన సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ఇప్పుడు నెల నెలా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నది. ఇలా అయితే పేదోళ్లు ఎలా బతుకుతారు? వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి.
సబ్సిడీ డబ్బులు అందేలా చూడాలి
కరోనాకు ముందు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గినా, పెరిగినా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రూపంలో రూ.100 – 300 వరకు జమ అయ్యేవి. ఆ తరువాత నుంచి సబ్సిడీ డబ్బులు కేవలం రూ.20 లోపు మాత్రమే జమ అవుతున్నాయి. అవి కూడా సక్రమంగా జమ కావడం లేదు. గ్యాస్ ధరలు పెంచడం ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలి. – దొమ్మేటి లత, గృహిణి, కొత్తగూడెం