కార్పొరేషన్లో శరవేగంగా అభివృద్ధి
సంపూర్ణ స్వచ్ఛత దిశగా అడుగులు
ప్రజలకు అందుబాటులో ఉంటా..
ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి
ఖమ్మం, అక్టోబర్ 2 ;ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను దేశంలోని అన్ని మున్సిపాలిటీల కంటే అగ్రభాగాన నిలపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు నూతన కమిషనర్ ఆదర్శ్ సురభి. ఖమ్మం కార్పొరేషన్గా అవతరించిన తర్వాత ఐఏఎస్ అధికారులే అధిక శాతం కమిషనర్లుగా ఉన్నారు. పాలనలో ప్రత్యేక ముద్ర వేశారు. నగరాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి రెండున్నరేళ్లు ఖమ్మం కార్పొరేషన్కు కమిషనర్గా పనిచేశారు. ఆయన ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. అనంతరం ప్రభుత్వం మరో ఐఏఎస్ అధికారి ఆదర్శ్ సురభిని కార్పొరేషన్ కమిషనర్గా నియమించింది. ఆయన గతంలో ఐఏఎస్ శిక్షణలో భాగంగా ఖమ్మంలో పని చేశారు. అది ఆయనకు కలిసొచ్చే అంశం. ఆ అనుభవం కార్పొరేషన్పై అవగాహన పెంచుకునేందుకు దోహదపడనున్నది. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆదర్శ్ను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు..
అభివృద్ధి పనులు పరిస్థితి ఏమిటి, ఏ దశలో ఉన్నాయి..?
నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నూతన కార్పొరేషన్ భవనాన్ని తర్వలోనే ప్రారంభించనున్నాం. గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్లాంటేషన్ను ఏర్పాటు చేయాలి. మురుగునీరు పారడానికి ప్రత్యేక డ్రెయిన్లు, వరదనీరు మున్నేరులో కలిసేలా ప్రత్యేక పైపులు నిర్మిస్తున్నాం. నిర్ధేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. లకారం ట్యాంకు బండ్ వద్ద వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
నగరంలో కొన్నిచోట్ల రోడ్ల ఆధునీకరించాల్సి ఉంది. ఇందుకోసం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారు.?
నూతన మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నాం. తొలుత ఫుట్పాత్లను నిర్మిస్తున్నాం. అంబేడ్కర్ సెంటర్ నుంచి ఐటీ హబ్ వరకు ముస్తఫానగర్ సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఫుట్పాత్లు నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నాం. తొలి గాంధీచౌక్లో ఫుట్పాత్లు నిర్మిస్తున్నాం. పాత మాస్టర్ప్లాన్తో కొన్ని రోడ్లలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని సరి చేస్తున్నాం. నగరంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. కొత్తగా డ్రెయిన్లను నిర్మించాం. ఇంకా విలీన గ్రామాలు, నగరంలో కొన్నిచోట్ల రోడ్లను ఆధునీకరించాల్సి ఉంది. నిధులను బట్టి సమయానుకూలంగా పనులు చేపడతాం.
నగరవాసులకు పారదర్శంగా సేవలు అందించేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు.?
నగరవాసులందరికీ పారదర్శంగా సేవలు అందించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటాను. అధికారులు జవాబుదారీతనంగా పనిచేస్తారు. ఏ అవసరం ఉన్నా.. నేరుగా సంప్రదించవచ్చు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటా. సమావేశాలు ఉన్నప్పుడు, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటా. జాబ్ చార్టును ఏర్పాటు చేయిస్తా.
సంపూర్ణ స్వచ్ఛత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
ఖమ్మం కార్పొరేషన్లో సంపూర్ణ స్వచ్ఛత సాధించడమే ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ప్రతి ఇంటికి చెత్త సేకరించడానికి ట్రాక్టర్ వెళ్తోంది. చెత్తబుట్టలు అందజేశాం. తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డులకు తరలిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాం. పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాం. రోజూ రోడ్లు, కాల్వలను శుభ్రం చేయిస్తున్నాం. ఇంటింటా చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తరలించి తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. పొడి చెత్తను రీసైక్లింగ్ చేస్తూ ఆదాయాన్ని సృష్టించేలా ముందుకు సాగుతున్నాం.