ఈ పథకంతో వారి జీవితాల్లో మార్పు
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
అనంతసాగర్లో సీఎం ఫ్లెక్సీకి దళితుల హారతి, క్షీరాభిషేకం
చింతకాని, సెప్టెంబర్ 2: ఎస్సీల తలరాతను మార్చేదే దళిత బంధు పథకమని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకం అమలు ద్వారా దళిత జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని, వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని స్పష్టం చేశారు. దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం.. కేసీఆర్ మాత్రమేనని అన్నారు. చింతకాని మండలంలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలో అనంతసాగర్ ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన దళితబంధు కృతజ్ఞతా సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి దళితులంతా కలిసి హారతి పట్టారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని అన్నారు. సర్పంచ్ నూతలపాటి మంగతాయారమ్మ, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు, చల్లా అచ్చయ్య, సారిక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.