ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలి
20 నాటికి సాధారణ ఓటర్ల సంక్షిప్త సవరణ ముగించాలి
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
కొత్తగూడెం/ మామిళ్లగూడెం, డిసెంబర్ 1: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆయా జిల్లాల అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 10న పోలింగ్ జరుగనున్నందున అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, రవాణా సౌకర్యం, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాలు తదితర ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలన్నారు.
20లోగా జాబితా సంక్షిప్త సవరణ..
ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని సీఈవో శశాంక్ గోయల్ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 4లోగా పరిషరించాలని సూచించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో శిరీష, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరథ్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం నుంచి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రాజు, సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.