మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పటిష్ట నిఘా
ఏజెన్సీ ప్రాంతాల పర్యటనలో డీజీపీ మహేందర్రెడ్డి
కొత్తగూడెం క్రైం/ బూర్గంపహాడ్, డిసెంబర్ 1: మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉందని, ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చర్ల మండలం చెన్నాపురం బేస్ క్యాంప్ వద్దకు వెళ్లి భద్రతా బలగాలకు పలు సూచనలు చేశారు. అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో భద్రాద్రి ఎస్పీ సునీల్దత్, ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో వారి కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు, నాకాబందీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ – ఛత్తీస్గఢ్ – ఆంధ్రా సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిఘా పటిష్టం చేయాలన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, జిల్లా పోలీస్ యంత్రాంగం సహకారంతో మావోయిస్టు సమస్యను అధిగమిస్తున్నామన్నారు.
అందరి సహకారంతో ముందుకు..
మావోయిస్టు రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, పోలీసు అధికారులు, ప్రజలు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని, తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రాద్రి, ములుగు, భూపాలపల్లిలను మావోయిస్టు రహిత జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. పోలీసులు మారుమూల గిరిజనులతో మమేకమై వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆదివాసీల్లో మార్పు తీసుకురావడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మెరుగైన పనితీరు కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారు. భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి ఎస్పీలు సమర్థంగా పనిచేస్తూ మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూశారని పేర్కొన్నారు. ఎస్పీలు సునీల్దత్, సంగ్రామ్సింగ్, ఏఎస్పీలు డాక్టర్ వినీత్, డాక్టర్ శబరీశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా, ఈ నెల 3 నుంచి 8 వరకు మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ముందస్తుగా డీజీపీ మహేందర్రెడ్డి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులు ఎక్కడికీ వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్శాఖ హై అలర్ట్ ప్రకటించింది.