జిల్లా వ్యాప్తంగా ఫస్ట్, సెకెండ్ డోసులను వెంటనే పూర్తి చేయాలి
సెంట్ పర్సెంట్ వ్యాక్సినేటెడ్ రాష్ట్రంగా తెలంగాణను ముందుంచాలి
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
కొత్తగూడెం, డిసెంబర్ 1: ఈ నెల 31లోగా మొదటి, రెండో డోసుల వ్యాక్సిన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ వచ్చినందున మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణను ముందుంచేందుకు కృషి చేయాలని సూచించారు.
అపోహలు నమ్మొద్దు: మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మొదటి, రెండు దశల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కరోనా మూడో దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అసత్య ప్రచారాలు, అపోహలను నమ్మొద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అందుతున్న సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు.
విద్యాసంస్థల్లో జాగ్రత్తలు: మంత్రి సబిత
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభమైనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవోలకు సూచించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తప్పక రెండు డోస్లు వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. అనంతరం భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. వ్యాక్సినేషన్ తక్కువ జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సెంట్ పర్సెంట్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్డీవో మధుసూదన్రాజు, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్, డీఎంహెచ్వో శిరీష, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.