తలసేమియా, క్యాన్సర్ బాధితుల కోసం రక్తదాన శిబిరం
ఖమ్మం నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తలసేమియా, క్యాన్సర్ బాధితుల కోసం ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాలతో నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది. మంగళవారం ఖమ్మం రీజియన్ పరిధిలో ఆరు డిపోల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించగా.. 467 మంది రక్తదానం చేశారు.అనేక ఏళ్లుగా పట్టిపీడిస్తున్న తలసేమియా, క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్స ఎంతో భారమవుతోంది. పేదలదైతే మరీ దీనావస్థ. ఇలాంటి పేదలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కారు అనేక పథకాలను ప్రవేశపెట్టింది. దీనికితోడు అనేక స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలు చేపట్టి బాసటగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచనల మేరకు టీఎస్ ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 88 కేంద్రాల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తాన్ని సేకరించారు. ఆర్టీసీ ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజలకూ అవగాహన కల్పించే బాధ్యతను చేపట్టింది. కాగా, ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించారు.
ఆర్టీసీ ఆధ్వర్యంలో..
తెలంగాణ ఏర్పాటు అనంతరం తక్కువ సమయంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్న టీఎస్ ఆర్టీసీ సామాజిక సేవలోనూ శెభాష్ అనిపించుకుంటోంది. తాజాగా తలసేమియా, క్యాన్సర్ రోగుల కోసం రక్తాన్ని సేకరిస్తోంది. మంగళవారం చేపట్టిన శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. దీని కోస సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా విస్తృత ప్రచారం చేపట్టారు. అంతేకాకుండా శిబిరానికి వచ్చి రక్తదానం చేసిన వారిని ఉచితంగా వారి ఇంటివద్ద దింపి వచ్చారు. బస్టాండ్లలోనూ అవగాహన కల్పించడం వల్ల చాలా మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు.
ఆరు డిపోల్లో 467 మంది రక్తదానం
టీఆఎస్ఆర్టీసీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల వల్ల ఎంతోమంది నిరుపేద రోగులకు రక్తం లభిస్తోందని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీటీవో తోట కిషన్రావుతో కలిసి సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులతోపాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని రక్తదానం చేశారని ఖమ్మం రీజినల్ మేనేజర్ సోలమాన్ తెలిపారు. ఖమ్మంలో శిబిరంలో సంస్థ ఉద్యోగులు 48, ఇతరులు 74, మధిరలో ఉద్యోగులు 23, ఇతరులు 57, సత్తుపల్లిలో ఉద్యోగులు 16, ఇతరులు 84, భద్రాచలంలో ఉద్యోగులు 34, ఇతరులు 18, కొత్తగూడెంలో ఉద్యోగులు 17, ఇతరులు 58, మణుగూరులో ఉద్యోగులు 22 మంది, ఇతరులు 16 మంది రక్తదానం చేసినట్లు వివరించారు. ఆరు డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులు 160, ఇతరులు 307 మంది కలిపి మొత్తం 467 మంది రక్తదానం చెప్పారు. ఖమ్మం శిబిరంలో డీవీఎం జే.సుగుణాకర్, వైద్యులు గిరిసింహారావు, రెడ్క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి రెడ్క్రాస్ సొసైటీ సర్టిఫికెట్లు ప్రదానం చేసింది.