అందుబాటులోకి ప్యాడీ క్లీనర్స్
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు ఉచితం
సర్కార్ చొరవతో రైతులకు తప్పిన తిప్పలు
సుజాతనగర్, నవంబర్ 30; ఆరుగాలం శ్రమించే అన్నదాత పంట వేసింది మొదలు చేతికొచ్చి అమ్మే వరకు అనేక పాట్లు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా వరికోతలు పూర్తయ్యాక కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరేదాక ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ ఎక్కువగా ఉందని, దుమ్ముధూళి, కర్ర, మట్టి పెళ్లలు ఉన్నాయని మిల్లర్లు ఐదు కిలోల వరకు తరుగు తీస్తారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. వీటన్నింటినీ గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను తీర్చేందుకు ప్యాడీ క్లీనర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని మార్కెట్ల వద్ద నిర్వాహకులు, రైతులకు ఉచితంగా అందిస్తున్నది. ఫలితంగా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు చేరడంతో రైతులకు ఆశించిన ధర లభిస్తున్నది.
మారుతున్న విధానం… నష్టపోతున్న రైతులు
ఇదివరకు కూలీలు వరికోసి మెదలు వేసే వారు. వారం రోజులు ఎండిన తరువాత కుప్పలుగా వేసి ఎడ్లతో తొ క్కించే వారు. గడ్డిని, ధాన్యాన్ని వేరు చేసిన తరువాత కరెం టు మోటార్లకు ఫ్యాన్లు పెట్టడం లేదా గాలికి తూర్పార పట్టేవారు. వారంరోజులు మెదలు ఎండటం వల్ల తేమశాతం పూర్తిగా తగ్గిపోయేది. గాలికి లేదా మోటార్లకు బిగించిన ఫ్యాన్ల ద్వారా తూర్పార పట్టడంతో తాలు, కర్ర, దుమ్ము పోయి ధాన్యం నాణ్యంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రైతులు హార్వెస్టర్లతో వరి కోయించి ధాన్యాన్ని నేరుగా ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నా రు. ధాన్యం ఎండకపోవడం, తేమ ఎక్కువగా ఉండడం, తూర్పార పట్టకుండానే నేరుగా చెత్తాచెదారాలతో కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. ఫలితంగా తేమశాతం ఎక్కువై ధాన్యం రంగుమారే అవకాశం లేకపోలేదు. దీనివల్ల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారం, తేమ ఉన్నందున మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యం తీస్తున్నారు. కొంతమంది రైతులు తేమశాతం తగ్గించి నాణ్యతగా తీసుకొస్తున్నా మరికొందరు నేరుగానే తెస్తున్నారు. దీంతో మిల్లర్లు రైతులందరి వద్ద తరుగు పేరుతో ధాన్యం తీయడం వల్ల నాణ్యతా ప్రమాణాలు పాటించిన వారు కూడా నష్టపోవాల్సి వస్తోంది.
ఇలా చేయాలి…
రైతులు కూలీలతో కాకుండా వరి కోతలకు హార్వెస్టర్లను ఉపయోగిస్తే వారంరోజుల పాటు వడ్లను చేలలోనే ఎండబెట్టుకోవాలి. తేమశాతం తగ్గిన తరువాత మోటార్లకు బిగించిన ఫ్యాన్లు, ప్యాడీ క్లీనర్ల ద్వారా తూర్పారపట్టాలి. దీంతో చెత్తాచెదారం, తాలు పోయి నాణ్యమైన ధాన్యం వస్తుంది. అప్పుడు ఆ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉండదు.
ఉచితంగా అందజేస్తున్నాం
కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తాలు ఉందని నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారు. రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు సొసైటీ పరిధిలో 12 ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చాం. వీటిని కేంద్రాల నిర్వాహకులు, రైతులకు ఉచితంగా అందిస్తున్నాం. యంత్రం ద్వారా తక్కువ మంది కూలీలతో గంటకు సుమారు 30 క్వింటాళ్ల ధాన్యం తూర్పార పట్టవచ్చు. ఆ తరువాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి మార్కెట్కు తీసుకొచ్చి గరిష్ఠ ధరను పొందే వీలుంటుంది.