Degree |హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో చేరాలనుకొనే విద్యార్థుల అభిరుచులు మారిపోతున్నాయి. అత్యధికులు డిగ్రీ చదువుతోనే ఆపేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీజీ కోర్సుల్లో 50% లోపు మాత్రమే సీట్లు నిండుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య 13,07,803. అదే పీజీ కోర్సుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య 2,41,910 మాత్రమే.
అంటే డిగ్రీ కోర్సుల్లోని మొత్తం విద్యార్థులతో పోల్చితే పీజీ కోర్సుల్లో చేరిన వారి శాతం కేవలం 18శాతమే. కన్వెన్షల్ వర్సిటీల్లో 10,20,796 మంది డిగ్రీ కోర్సుల్లో చేరితే, పీజీ కోర్సుల్లో చేరిన వారు 1,64,800 మంది మాత్రమే. ఇక స్పెషలైజ్డ్ వర్సిటీల్లో 2,02,649 మంది డిగ్రీ కోర్సుల్లో చేరితే పీజీ కోర్సుల్లో 20,048 మంది మాత్రమే ఉన్నారు. వాస్తవానికి వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో చదవడమంటేనే గతంలో క్రేజీ ఉండేది. కానిప్పుడా క్రేజీ కనిపిండచంలేదు. ఏ యూనివర్సిటీ తీసుకున్నా.. ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా ఇదే పరిస్థితి నెలకొన్నది.
