Water War | టెహ్రాన్: గల్ఫ్ దేశాల బలం చమురు అయితే.. బలహీనత నీరు. ఇరాన్-అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ దుర్భలత్వాన్ని బయటపెట్టింది. ఒక వేళ మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటికోసమే అని పలువురు నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. రానున్న కాలంలో తాగునీటి కొరత అంత తీవ్రంగా ఉంటుందని దీనర్థం. ఎడారి వాతావరణం ఉన్న గల్ఫ్ దేశాల్లో నీటికొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. తమ నీటిశుద్ధి ప్లాంట్పై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఆత్రుతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్భలమైన తాగు నీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటిశుది ్ధప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహం.
పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటిశుద్ధి ప్లాంట్లను ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60 శాతం నీటిశుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడటంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి. అలాగే ఇరాన్లోని ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి.