సమాయత్తమైన పార్టీ శ్రేణులు
గ్రామాల్లో జెండా ఎగురవేయనున్న టీఆర్ఎస్ సర్పంచ్లు
ఖమ్మం, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో జెండా పండుగను ఒకేసారి నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో పార్టీ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్లు, వారు లేనిచోట పార్టీ నుంచి ఎన్నికైన ఇతర ప్రజాప్రతినిధులు పతాకావిష్కరణ చేయనున్నారు. టీఆర్ఎస్ సంస్థాగత బలోపేతంతోపాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికతో నాయకులు ముందుకు సాగుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జెండా పండుగ కోసం టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ రాష్ట్రస్థాయిలో రూపొందించిన నెలరోజుల కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అమలుపర్చేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఢిల్లీలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తికాగానే ఆయా నేతలు తమ తమ నియోజకవర్గాలకు తిరిగి వచ్చి స్థానికంగా జరిగే సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గురువారం జరిగే జెండా పండుగలను నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ ప్రస్థానం, అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమానికి అంకితమైన తీరు వంటి అంశాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ నేతలు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ సంస్థాగత వ్యవహారాలు, జెండా పండుగ నిర్వహణలపై ముఖ్య నేతలతో సమీక్షించారు. నగరంలోని ప్రతి డివిజన్లో టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కార్పొరేటర్, కార్పొరేటర్ లేని చోట డివిజన్ ఇన్చార్జులు పార్టీ పతాకాలను ఆవిష్కరిస్తారు.
ఉదయం 8:30 గంటలకు టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. డివిజన్లలో ఇప్పటికే గులాబీ తోరణాలను కట్టి పండుగ వాతావరణాన్ని కల్పించారు. పార్టీ స్తూపాలకు రంగులు వేసి పతాకావిష్కరణలకు సిద్ధం చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో జెండా పండుగలను ఒకేసారి నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో అయితే పార్టీ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్లు, సర్పంచ్లు లేని చోట పార్టీ నుంచి ఎన్నికైన ఇతర ప్రజాప్రతినిధులు పతాకావిష్కరణ గావించనున్నారు. ప్రతి చోటా పతాకావిష్కరణలకు ప్రజలు భారీగా హాజరయ్యే విధంగా చూడాలని పార్టీ ఇప్పటికే సూచించింది. పతాకావిష్కరణలతోపాటు జెండా పండుగ పూర్తి కాగానే ఆయా గ్రామాల్లో సంస్థాగత వ్యవహారాలపై పార్టీ నేతలు దృష్టి సారించనున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కమిటీల ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా జిల్లా, మండల స్థాయిలో సోషల్ మీడియా కమిటీలనూ ఏర్పాటు చేయాలని పార్టీ సంకల్పించింది. సంస్థాగత వ్యవహారాలపై టీఆర్ఎస్ దృష్టి సారించడంతో గ్రామాల్లో రాజకీయ కోలాహలం నెలకొన్నది. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జెండా పండుగలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి అజయ్ తెలిపారు.