మామిళ్లగూడెం, జూలై 31: ప్రజా అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా సేవలు అందిస్తూ వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పనిచేస్తూనే దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సీసీ టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ‘నేను సైతం’, ‘కమ్యూనిటీ పోలీసింగ్’లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలని, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలని సూచించారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ నాణ్యమైన సత్వర సేవలు అందించాలని సూచించారు. పోక్సో యాక్టు కేసులో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఫలితాలు రాబట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కేసులపై తీసుకున్న చర్యలను సీపీ విష్ణు ఎస్ వారియర్ వివరించారు. డీసీపీలు ఇంజారపు పూజ, ఎల్సీ నాయక్, అడిషనల్ డీసీపీలు సుభాశ్చంద్రబోస్, కుమారస్వామి పాల్గొన్నారు.