విత్తన, ఎరువుల కొరత రాకుండా చర్యలు
ప్రణాళిక సిద్ధం చేసిన జిల్లా వ్యవసాయశాఖ
సొసైటీలకు విత్తనాలు చేరవేస్తున్న సీడ్స్ కార్పొరేషన్
ఖమ్మం వ్యవసాయం, మే 4 : వానకాలం సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాలు, ఎరువుల కోసం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్, మార్క్ఫెడ్కు ఇండెంట్లను పంపించింది. కరోనా విపత్కర పరిస్థితులున్నా.. వానకాలం సాగుకు విఘాతం కలగకుండా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేందుకు వ్యవసాయశాఖ ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఈ సారి వానకాలం సాగు రికార్డు స్థాయిలో జరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5,87,559 ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.. రైతులు భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయి. వానకాలం సాగుకు మరో నెలరోజులు గడువు ఉన్నది. ఈ సీజన్ సాగు పనులపై వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే సాగు ప్రణాళిక తయారు చేసి విత్తనాలు, ఎరువుల కోసం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్, మార్క్ఫెడ్కు ఇండెంట్లను పంపించింది. ఈ ప్రణాళికను ఆమోదించడంతో తదుపరి కార్యాచరణ రూపొందించే పనిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రాబోయే సీజన్లో సాగును దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఎరువులు జిల్లా కేంద్రంలో నిల్వ చేసుకునేందుకు మార్క్ఫెడ్, రాయితీ విత్తనాలు (పచ్చిరొట్ట, వరి, పెసర, కంది, మొక్కజొన్న)కు ఇండెంట్ను తయారు చేశారు. కరోనాతో విపత్కర పరిస్థితులున్నా.. వానకాలం సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేలా చర్యలు చేపట్టారు.