ఖమ్మం, ఫిబ్రవరి 23 (నమస్తేతె లంగాణ ప్రతినిధి): ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, వారికి ప్రభుత్వ ఫలాలను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచే స్తున్నది. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో పట్టణాలు, నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం నగరం హైదరాబాద్కు దీటుగా ప్రగతి సాధించింది. రాష్ట్రంలోని ఇతర నగరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ ఘనత ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కే దక్కుతుంది. నగరాభివృద్ధిలో ఆయన కృషి ఎంతో ఉంది. నగర ప్రజలను దశాబ్దాల పాటు పీడించిన గోళ్లపాడు మురుగు కాల్వ సమస్యకు మంత్రి శాశ్వత పరిష్కారం చూపారు. మురికి కూపాల్లా ఉన్న ప్రాంతాలను ఇప్పుడు సుందర వనాలుగా మార్చారు. మంత్రి అజయ్కుమార్ కృషిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శాసనసభ సాక్షిగా ఇటీవల ప్రశంశించారు. ఖమ్మం నగరాభివృద్ధి ఇతర నగరాలకూ ఆదర్శమని కొనియాడారు. ఇప్పటికే నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించి భేష్.. అంటూ కితాబునిచ్చారు. వీరితో పాటు ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఖమ్మ నగరాన్ని మోడల్గా తీసుకుని తమ ప్రాంతాలనూ ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటామని తిరిగి వెళ్లారు.
నగరానికి నిధుల వరద..
‘వాడ వాడకు పువ్వాడ’లో భాగంగా మంత్రి అజయ్కుమార్ నగరంలో నెలకొన్న కొన్ని సమస్యలను గుర్తించారు. వాటిని పరిష్కరించేందుకు రూ.32 కోట్లు అవసరమని అంచనాకు వచ్చి రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ను నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారు. అలాగే గతనెల 18న ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధికి రూ.50 కోట్లు ప్రకటించారు.
‘వాడ వాడ’కు శ్రీకారం..
నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జనవరి 1న ‘వాడ వాడకు పువ్వా డ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మంత్రి ఇప్పటివరకు ఐదు డివిజన్లలో పర్యటించారు. నగరపాలక సంస్థ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, మున్పిల్ అధికారులతో కలిసి ఉదయాన్నే పర్యటన ప్రారంభిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయనే స్వయంగా బుల్లెట్ నడుపుతూ, కొన్నిసార్లు సైకిల్ తొక్కుతూ డివిజన్లలో కలియదిరుగుతున్నారు. తాను గుర్తించిన సమస్యలను వెంటనే నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశిస్తున్నారు. పథకాల లబ్ధి కోసం వ్యక్తిగతంగా ఇచ్చిన వినతులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలతో పాటు ఐదు డివిజన్లలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజలు కోరిన విధంగా డివిజన్లలో డ్రైనేజీలు నిర్మించారు. వీధి దీపాలు సమకూర్చారు. వాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయించారు. అంతర్గత రహదారులు నిర్మించారు. దీంతో నగరవాసులకు పర్యటనపై భరోసా ఇచ్చింది. మంత్రి పర్యటనను ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు.
లబ్ధిదారుల ఇంటికే ‘కల్యాణలక్ష్మి’..
‘వాడ వాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా మంత్రి అజయ్కుమార్ లబ్ధిదారుల ఇంటికే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేస్తున్నారు. ఆడపడుచులకు చీరెను సారెగా అందజేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని డివిజన్ల పరిధిలో 105 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 97 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు అందాయి. మంత్రి ఇంటికే వచ్చి చెక్కులు అందిస్తుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటికే కల్యాణలక్ష్మి చెక్కులు..
వాడవాడకు పువ్వాడ కార్యక్రమంలో భాగంగా మంత్రి అజయ్కుమార్ లబ్ధిదారుల ఇంటికే వచ్చి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఆడపడుచులకు చీరె కానుకగా అందిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నారు. వినతులు స్వీకరిస్తున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. తెలంగాణ వచ్చినాకే నగరం అభివృద్ధి చెందింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఖమ్మాన్ని పట్టించుకోలేదు.
– మౌనిక , ఖమ్మం నగరం
సమస్యలకు పరిష్కారం..
గత ప్రభుత్వాల హయాంలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. ప్రజాప్రతినిధులను కలవాలంటే మధ్యవర్తులను పట్టుకోవాలి. నయానో భయానో వారిని చూసుకుంటే తప్ప పనయ్యేది కాదు. ‘వాడ వాడకు పువ్వాడ’లో భాగంగా మంత్రి అజయ్ డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చొరవ చూపుతున్నారు.
– సుందరయ్య, ఖమ్మం నగరం
నిరంతర ప్రక్రియ..
నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘వాడ వాడకు పువ్వాడ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పర్యటనలో భాగంగా డివిజన్లకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. వారి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తుండడంతో ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన వినతులు, దరఖాస్తులను సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నాం. సాధ్యాసాధ్యాలను పరిశీలించి న్యాయం చేయాలని ఆదేశిస్తున్నాం. ‘వాడ వాడకు పువ్వాడ’ నిరంతర ప్రక్రియ. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్