ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 12: ఖమ్మ నగరం పూల వనమైంది.. తీరొక్క పూలతో బతుకమ్మలు కొలువుదీరి నేలపై హరివిల్లులు పరిచాయి.. గౌరమ్మను పూజిస్తూ ఆడబిడ్డలు ఆడి పాడారు.. ‘శివుడి ముద్దుల గుమ్మ..’ అంటూ గానమెత్తుకున్నారు.. బతుకమ్మా దీవించాలంటూ.. ప్రణమిల్లారు.. మంగళవారం ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అన్ని ప్రభుత్వశాఖలు నిర్వహించిన ‘మహా బతుకమ్మ’ వేడుక ఆద్యంతం సంబురంగా సాగింది.. ముఖ్యఅతిథిగా కలెక్టర్ వీపీ గౌతమ్ హాజరై మాట్లాడారు. అచ్చమైన మహిళల పండుగ బతుకమ్మ అని అన్నారు. ఐక్యతా విలువలకు బతుకమ్మ పండుగ నిదర్శనమన్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా రెండేళ్లు వేడుకలు నిర్వహించలేకపోయామని, ప్రభుత్వం ఈసారి అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నదన్నారు. అనంతరం కలెక్టర్, సీపీ, అదనపు కలెక్టర్ మధుసూదన్, ట్రైనీ కలెక్టర్ రాహుల్ కోలాటమాడుతూ సందడి చేశారు. వేడుకల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్డీవో విద్యాచందన, మార్కెటింగ్శాఖ అధికారి నాగరాజు, ఎస్టేట్ అధికారులు శ్వేత, పద్మావతి, పశు సంవర్థక శాఖ వేణు మనోహర్రావు, సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.