కల్లూరు, జూలై 29 : కులమతాలకతీతంగా రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని, యువతుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో సీహెచ్ సూర్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.80 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధ్దిదారులకు అందించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రాజ్యానికి చిరునామాగా నిలుస్తుందని, ఇలాంటి బృహత్తర పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక కొందరు బీజేపీ, ప్రతిపక్ష నాయకులు విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు నడుస్తున్నాయా! లేదా..ఈటల రాజేందర్తో సహా బీజేపీ నాయకులు తమ వైఖరిని తెలియజేయాలన్నారు. సోషల్ మీడియా ముసుగులో కొందరు వ్యక్తులు కించపరిచేలా విమర్శలు చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. దళిత బంధుపై కుట్రలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంగీలాల్, ఎంపీడీవో టి.శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, జిల్లా, మండల రైతు బంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, జడ్పీకోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, వెంకటేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.