ఖమ్మం ఆగస్టు 3: మంగళవారం తెల్లవారుజామున నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సైకిల్పై బయలుదేరిన మంత్రి అజయ్.. కస్బాబజార్ మీదుగా చర్చికాంపౌండ్ సెంటర్ వరకు వెళ్లారు. అక్కడ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేసి జంక్షన్ను ఏర్పాటు చేయాలని, సుందరంగా ఉండాలని ఆర్అండ్బీ ఈఈకి సూచించారు. సెంట్రల్ లైటింగ్కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీపీకి సూచించారు. అక్కడ నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వెళ్లారు. పోలీస్ కంట్రోల్ ప్రాంతంలోనూ జంక్షన్ నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీపీ కార్యాలయ ఆవరణలో పార్కును సుందరంగా తయారు చేయాలన్నారు. సుందరయ్య నగర్ ప్రాంతంలో ఉన్న గోళ్లఫాడు ఛానల్ కాలువను, దానిపై నిర్మించిన పార్కులను పరిశీలించారు. పంపింగ్వెల్ రోడ్డు మీదుగా వెళ్తూ స్థానిక మహిళలతో మాట్లాడారు. ప్రతి రోజూ మంచి నీళ్లు వస్తున్నాయా? ఎన్ని గంటల వస్తున్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ ముందు భాగం నుంచి గాంధీచౌక్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఇరువైపుల డ్రైన్ను నిర్మించాలని కేఎంసీ కమిషనర్కు సూచించారు. గాంధీచౌక్లో నూతన రోడ్డు పనులను పరిశీలించారు. విద్యుత్ స్తంభాలను ఎందుకు తొలగించలేదని ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత రైల్వే ఓవర్ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయకపోవడంపై ఆర్ఆండ్బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ ముందు భాగంలో కూడా రోడ్డు విస్తరిస్తే ట్రాఫిక్ సమస్యలు ఉండవని అన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఆవరణను పరిశీలించారు. తరువాత లకారం ట్యాంక్బండ్పై మొక్కలు నాటారు.
ఖమ్మం నగరంలో ఫుట్పాత్ ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభించి ఖమ్మం నగరాన్ని క్లీన్ ఖమ్మం, గ్రీన్ ఖమ్మంగా తీర్చిదిద్దుతామని మంత్రి అజయ్కుమార్ తెలిపారు. త్రీటౌన్లోని మార్కెట్రోడ్డులో మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. నగరంలోని వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఖానాపురం హవేలీ ప్రాంతాల్లో ఒక్కో మోడల్ రోడ్డు చొప్పున మొత్తం నాలుగు రోడ్లను ఎంపిక చేసి హైదరాబాద్ మాదిరిగా ఫుట్పాత్ ప్రాజెక్టు పనులను చేపడతామని అన్నారు. నగర ప్రజలు సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అడిషనల్ డీసీపీ సుభాశ్ చంద్రబోస్, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, విద్యుత్ ఈఈ రమేశ్, డీఎఫ్వో ప్రవీణ, డీఆర్డీవో విద్యాచందన, సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్, కార్పొరేటర్లు పసుమర్తి రామ్మోహన్రావు, టీఆర్ఎస్ నాయకులు పాలడుగు పాపారావు, దోన్వాన్ రవి, కన్నం ప్రసన్నకృష్ణ, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.