-ఖమ్మం అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గతంలో రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నా.. సలహాలు, సూచనలు తీసుకోవాలన్నా.. పైరుకు తెగులు ఆశించినా ఎలా సంప్రదించాలో తెలియక ఇబ్బందిపడేవారు. దీనికితోడు వ్యవసాయాధికారుల కొరత.. ఒకవేళ ఉన్నా.. వారు అందుబాటులో లేక అరిగోస పడ్డారు. ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కర్షకులు రోజంతా సమయం కేటాయించి మండల కేంద్రాలకు పరుగులు తీసేవారు. కానిప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాధికారులను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. వ్యవసాయ పరంగా ఎలాంటి అవసరమున్నా.. నేరుగా వ్యవసాయాధికారులను కలిసే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, వ్యవసాయపరంగా రైతులకు మరింత చేయూతనివ్వాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కర్షకులకు సాగులో మెళకువలు తెలుసుకొనేందుకు, అవగాహన సదస్సుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. 5 వేల ఎకరాలను పరిగణలోకి క్లస్టర్గా గుర్తించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 129 క్లస్టర్లను గుర్తించింది. క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. ఒక్కొక్క రైతు వేదికకు సుమారు రూ.22 లక్షల చొప్పున వెచ్చించింది. వ్యవసాయశాఖ, ఉపాధిహామీ పథకం నుంచి సంయుక్తంగా నిధులు మంజూరు చేసింది. ఒక్కో రైతు వేదికను 2.046 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించింది. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించింది.
సొంత నిధులతో నిర్మాణం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో సొంత నిధులతో అత్యాధునిక హంగులతో రైతు వేదిక నిర్మించారు. ఇక్కడి నిర్మించిన రైతు వేదిక యావత్ రాష్ర్టానికే తలమానికంగా నిలిచింది. కూసుమంచిలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన సొంత నిధులతో రైతు వేదిక నిర్మాణం చేపట్టారు. వీ వెంకటాయపాలెంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ ఈర్లపూడిలో తమ సొంత నిధులతో రైతు వేదికలను నిర్మించారు. దాదాపు 26 చోట్ల రైతులు, ఆయా గ్రామాల ప్రముఖులు రైతు వేదికల నిర్మాణానికి తమ విలువైన స్థలాలను విరాళంగా ఇచ్చారు.
సాగులో మెళకువలు..
రైతు వేదికలు వ్యవసాయాధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవడానికి ఉపయుక్తంగా మారాయి. అంతేకాదు, సాగులో మెళకువలు, అవగాహన, చైతన్య సదస్సుల నిర్వహణ, అధునిక వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవడానికి తోడ్పడుతున్నాయి. నిత్యం రైతులు, అధికారులతో వి విధ రకాల వ్యవసాయ చర్చాగోష్టులతో రైతు వేదికలు కళకళలాడుతున్నాయి. రైతులకు సాగుపై మరింత అవగాహన పెంచడంతోపాటు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులకు వ్యవసాయ అధికారులు ఈ వేదికల ద్వారా పరిచయం చేస్తున్నారు. రైతు వేదికలో రైతులకు ప్రత్యేక సమావేశ మందిరం వ్యవసాయాధికారి కోసం కార్యాలయ గదిని నిర్మించారు. ప్రతి రైతు వేదికలో 125 కుర్చీలతోపాటు ఓ మైకు సెట్ ఏర్పాటు చేశారు. క్లస్టర్ పరిధిలోని రైతులకు వ్యవసాయ పరమైన సలహాలు, సూచనలను అందించడానికి రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉంటున్నారు. వ్యవసాయశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మధిర, వైరా వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు రైతులకు సాగులో ఉపయోగపడే అంశాలు, అధిక దిగుబడులకు అనుసరించాల్సిన పద్ధతులు, పంటలకు సోకే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు.