అశ్వారావుపేట, సెప్టెంబర్ 2 : ఓటరు జాబితాలో పేరుందో.. లేదో.. తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం యాప్లు, వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతోపాటు ఇదివరకు ఓటు హక్కు ఉన్న వారి పేరు జాబితాలో ఉందో.. లేదో.. తెలుసుకోవడంతోపాటు పేరు, చిరునామా తదితర మార్పుల సవరణకు అవకాశం ఇచ్చింది. దీంతోపై జిల్లా అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు అవగాహన కల్పిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో..
నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో)లు ఉంటారు. వారి వద్ద పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా ఉంటుంది. అందులో ఓటు ఉందో.. లేదో.. తెలుసుకోవచ్చు.
ఓటు లేకుంటే…
ఒకవేళ జాబితాలో ఓటరు పేరు లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం-6 ద్వారా పూర్తి చేసిన దరఖాస్తును నేరుగా బీఎల్వోలకు అందజేయవచ్చు. లేదా ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాల్లోనూ ఇవ్వొచ్చు. ప్రతి నియోజకవర్గంలో డివిజన్ స్థాయి అధికారిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)గా, ప్రతి మండలానికి తహసీల్దార్ లేదా నయాబ్ తహసీల్దార్ను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఏఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరు దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పిస్తారు.
ఓటరు గుర్తింపు కార్డు ద్వారా..
ఓటరు గుర్తింపు కార్డు ద్వారా కూడా ఓటును పరిశీలించుకోవచ్చు. http//voterportal. eci.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేస్తే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్’ కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ ఫొటో గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. దీంతో జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది.. సీరియల్ నెంబర్ ఎంత.. వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఫొటో ఓటరు గుర్తింపు సంఖ్య తెలియకపోతే ‘అడ్వాన్స్ సెర్చ్’ కాలంలోకి వెళ్లి.. మీ పేరు, తండ్రి పేరు, వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. తెలుస్తుంది.
ఓటరు జాబితా చూసుకోవచ్చు..
పోలింగ్ కేంద్రాలవారీగా వెబ్సైట్లో ఓటర్ల జాబితాను చూసుకోవచ్చు. http//ceo.telangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే.. పై బాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే అసెంబ్లీ నియోజకవర్గం అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. అందులో ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకుని దానికి సంబంధించిన ఓటరు జాబితాను పరిశీలించుకుని మీ ఓటు ఉందో.. లేదో.. తెలుసుకోవచ్చు.
వివరాలు నమోదుతో..?
మీ పేరు, వివరాల నమోదు ద్వారా కూడా మీ ఓటు ఉందో.. లేదో.. తెలుసుకోవచ్చు. www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్తే ‘సెర్చ్ ఎన్ ఎలక్టోరల్ రోల్’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డిటెయిల్స్’, ‘సెర్చ్ బై ఎలక్టోరల్ నెంబర్’ అనే రెండు ఆప్షన్లు వస్తాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు ఉన్నదీ.. లేనిదీ.. తెలుస్తుంది.
వెబ్సైట్లో కొత్త ఓటరు నమోదు..
కొత్త ఓటరు నమోదును వెబ్సైట్లోనూ చేసుకోవచ్చు. www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. ‘రిజిస్టర్ యూజ్ ఏ న్యూ ఓటర్’ అని ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫారం-6 అప్లికేషన్ ఫాం ఫర్ న్యూ ఓటర్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆన్లైన్ దరఖాస్తు వస్తుంది.అందులో పేర్కొన్న వివరాలన్నీ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నెంబర్కు రిఫరెన్స్ ఐడీ నెంబర్ వస్తుంది. ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్ స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే ఓటరు జాబితాలో మీ పేరు చేర్చుతారు. అప్పటి నుంచి మీకు జాబితాలో ఓటు హక్కు ఉంటుంది.
హెల్ప్లైన్ మొబైల్ యాప్లో..
గూగుల్ ప్లే స్టోర్లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటరు హెల్ప్లైన్ మొబైల్ యాప్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. యాప్లోకి ప్రవేశించిన వెంటనే పైభాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్ ఎలక్టోరల్ రోల్’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్’, ‘సెర్చ్ బై ఎలక్టోరల్ నెంబర్’ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండింటికి సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. తెలుస్తుంది. మీ పేరు, తండ్రి పేరు, వయస్సు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపర్చడం ద్వారా జాబితాలో పేరు ఉందో.. లేదో.. తెలుసుకోవచ్చు. అలాగే http//ceo.telangana.nic.in వెబ్సైట్లోకి వెళ్లి ఎన్వీఎస్పీ ఓటరు పోర్టల్ వెబ్సైట్ లింక్లోకి వెళ్లి కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా ఏమైనా సందేహాలుంటే 1950 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
ప్రస్తుతం కొత్త ఓటరు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. పాత ఓటర్లు కూడా జాబితాలో ఓటు ఉందో.. లేదో.. సరిచూసుకుని, ఒకవేళ లేకుంటే కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జాబితాలో ఓటరుగా చేర్చుతాం.
– వనం కృష్ణప్రసాద్, తహసీల్దార్, అశ్వారావుపేట