గుంటూరుకు చెందిన రామారావుకు ఎర్రుపాలెంకు చెందిన రాజేశ్వరికి 42 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరిది పేదకుటుంబం. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. గుంటూరులో బతుకుదెరువు లేక ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు. పోచిరాజు రామారావు నగరంలోని వైరా రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అద్దె ఇంట్లో ఉంటూ కొద్ది సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. రామారావు, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం.. కాగా పెద్ద కూతురు విజయలక్ష్మి, చిన్న కూతురు పుష్ప, కుమారుడు అనిల్కుమార్. వారిలో శారీరక ఎదుగుదల లేకపోవడం వారిని కలిచివేసింది.. బంధుమిత్రులు, ఇతర కుటుంబసభ్యులు చెప్పిన ఆసుపత్రికెళ్లి వైద్యులకు చూపించినా ఫలితం లేదు.. కారణం మేనరికం అని వైద్యులు బదులిచ్చారు.. రామారావు తన అక్క కూతురే రాజ్యలక్ష్మి.. మేనరికం కారణంగా నూటిలో పది మందికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని వైద్యులు చెప్పడంతో చేసేది ఏమి లేక వారు మిన్నకుండిపోయారు.. వచ్చే ఆదాయంతోనే భార్య, ముగ్గురు పిల్లలను పోషించాడు. ఆనందంగా గడిచిపోతున్న సందర్భంలో ఆకుటుంబ పెద్దకు వచ్చిన రోగం వారిని కలిచివేసింది..
క్యాన్సర్తో రామారావు, ఆయన ఇద్దరు కూతుళ్లు మృతి..
రామారావుకు కొద్దికాలంగా ఆరోగ్యం బాగుండడం లేదు.. భార్య రాజేశ్వరి, పిల్లలకు చెప్పకుండా తన పనికి తాను వెళ్లేవాడు.. ఉన్నట్టుండి ఒక రోజు రామారావు దగ్గుతున్న సందర్భంలో నోటి నుంచి రక్తం రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్యాన్సర్గా నిర్ధారించారు.. అది నాల్గవ స్టేజీ అని, చేసేది ఏమి లేదని వైద్యులు తేల్చి చెప్పారు.. దీంతో భార్య రాజేశ్వరికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టయింది.. 2009వ సంవత్సరంలో రామారావు క్యాన్సర్తో మృతిచెందాడు.. అది మరువక ముందే రెండు నెలలకే ఇద్దరు కూతుళ్లూ క్యాన్సర్తో మృతిచెందారు.. ఆరునెలల సమయంలోనే భర్త, ఇద్దరు కూతుళ్లు చనిపోయారు.. అప్పటివరకు ఇంటి నుంచి బయటకురాని రాజేశ్వరిపై ఇంటి బాధ్యతలు మోయాల్సి వచ్చింది.. ఆమెకు సొంత ఇళ్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉండే రాజేశ్వరికి భర్త, ఇద్దరు కూతుళ్లు మృతిచెందడంతో ఉన్న ఒక్క కుమారుడిని పోషించుకోవడం తలకు మించిన భారమైంది.. ఎలా జీవించాలో తెలియని ఆమెకు కొద్దిమంది బంధువులు తోడయ్యారు. వంట మనిషి దగ్గర పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుంది..
40 ఏండ్ల నుంచి కుమారుడు మంచానికే పరిమితం..
అనిల్కుమార్(40) ఖమ్మంలోనే 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాడు.. ఆ తర్వాత ఆరోగ్యం సరిగాలేక మంచానికే పరిమితమయ్యాడు.. అయినప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో ఓపెన్లో పదోతరగతి, ఇంటర్ వరకు చదివాడు.. ఇటీవల అతనికి లివర్కు సంబంధించిన వ్యాధి రావడంతో అతనిని బతికించుకోవడానికి తల్లి పడుతున్న వేదన ఇంతా అంతా కాదు.. దీనికితోడు ఎనిమియా కూడా ఉండడంతో ప్రతినెలా అతనికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.. దీని కోసం నెలకు దాదాపు రూ.10వేలు ఖర్చు అవుతున్నాయి.. మందులకు అదనంగా ఖర్చు చేయాల్సిందే… హైదరాబాద్లోని నిమ్స్లో పదేళ్లు మందులు వాడారు.. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు.. ఆర్థికస్థొమత లేకపోవడంతో భర్తను, ఇద్దరు కూతుళ్లను కోల్పోయింది.. ఉన్న ఒక్క కుమారుడిని ఎలాగైనా బతికించుకోవాలనే ఆశతో దాదాపు రూ.5 లక్షలు అప్పులు చేసి వైద్యం చేయించింది. అయినా ఫలితం లేకుండా పోతుందని కన్నీటి పర్వంతం అవుతుంది రాజేశ్వరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా ఇచ్చే ఆసరా పింఛన్ రూ.2 వేలు కొండంత అండగా నిలుస్తుందని రాజేశ్వరి పేర్కొంది. మానవతా మూర్తులు ఆదుకోవాలని వేడుకుంటున్నది. దాతలు, మానవతా మూర్తులు సాయం చేయాలనుకునేవారు 81259 70496, 90001 7149 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరుతోంది.