బోనకల్లు, జనవరి 3: ఏడేళ్ల క్రితం ఆ ఆసుపత్రి అంటేనే ఆమడ దూరం వెళ్లేవారు ఇక్కడి జనం.. కానీ ఈ క్షణం మాత్రం.. ఇదే ఆసుపత్రి అంటే క్యూలో ఉండి మరీ సేవలు పొందుతున్నారు. ఇదే జనం.. అదే బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మరి ఈ ఏడేళ్లలో ఏం జరిగింది? ఎందుకు ఈ ఆసుపత్రి ఇంతలా ఆదరణ చూరగొంటోంది అనేదే ఈ కథనం. ఏడేళ్ల క్రితం ఈ ఆసుపత్రి అంటే ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ భయపడేవారు. ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందాలంటేనే జంకేవారు. అప్పటి భవనాలు కానీ, అందులో అందే వైద్య సేవలు కానీ అంత దయనీయంగా ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఆసుపత్రి దశ క్రమంగా మారుతూ వచ్చింది. వైద్య సదుపాయాలపై ఎక్కువ దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా నిధులు పెంచుతూ వచ్చింది. ఆసుపత్రులను అధునాతనంగా తీర్చి దిద్దింది. నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ వస్తోంది. దీంతో ప్రజలందరూ తిరిగి ఇదే ఆసుపత్రిలో వైద్య సేవల కోసం క్యూ కట్టడం మొదలు పెట్టారు.
మెరుగైన సేవలకు మారుపేరుగా..
ఈ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతుండడంతో క్రమంగా ఇది ప్రజలకు చేరువైంది. రోగులకు, ప్రజలకు మరింత నమ్మకం బలపడడంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు రావడం మొదలైంది. ఏ చిన్న ఆరోగ్య సమస్య అయినా వైద్యశాలకు రావడం, స్థానిక వైద్యులు శ్రీకాంత్, బాలకృష్ణల వద్ద సేవలు పొందడం జరుగుతోంది. ఇక గైనకాలజీ విభాగంలోనూ మెరుగైన సేవలు అందుతుండడంతో గర్భిణులు రాక కూడా పెరిగింది. సాధారణ ప్రసవాల సంఖ్య కూడా పెరగడం, దానికి కేసీఆర్ కిట్ వంటివి తోడవడంతో విశేష ఆదరణ పొందుతోంది. ఈ వైద్యశాలలో ప్రత్యేకంగా కాన్పుల గది, ల్యాబొరేటరీతోపాటు ఇన్పేషెంట్ల కోసం ఆరు బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రోగులు, వారి సహాయకుల కోసం కుర్చీలు, ఫ్యాన్లు, వినోదం కోసం టీవీ వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. మండలంలోని 9 సబ్సెంటర్ల పరిధిలో 22 గ్రామాల్లోని ప్రజలకు ఇదే ప్రధాన వైద్యశాల అయింది. దీనికితోడు ఇక్కడ వైద్యులు తమ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ రెగ్యులర్గా శిబిరాలు ఏర్పాటు చేస్తూ, వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు.
ఆవరణం.. ఆహ్లదం..
ఇక ఈ వైద్యశాల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ఆసుపత్రి ఎదుట పచ్చనిగడ్డితోపాటు పూలమొక్కలను ఏర్పాటు చేసింది. ఆవరణలో టేకుమొక్కలను నాటింది. ఇన్నేళ్ల ఈ ఆసుపత్రి చరిత్రలో ఈ ఏడాది నుంచి మాత్రం ఇటు ఇన్ పేషెంట్లకు, అటు ఔట్ పేషెంట్లకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయి.
అన్ని వ్యాధులకూ చికిత్స..
కుక్క కాటు, కోతుల కాటుతోపాటు అన్ని వ్యాధులకూ చికిత్స అందిస్తూ మన్ననలు పొందుతోంది ఈ బోనకల్లు పీహెచ్సీ.సాధారణ కాన్పులు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రిలో ప్రసవం పొందిన అందరికీ కేసీఆర్ కిట్లు అందుతున్నాయి. ప్రతి రోజూ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత విడతలో కంటివెలుగు క్యాంపుల ద్వారా మండలంలో 26,239 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,156 మందికి కళ్లజోళ్లు అందించారు. టీబీ, లెప్రసీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నారు. పౌష్టికాహారం కోసం వారికి ప్రతినెలా రూ.500ను వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. కొవిడ్ సమయంలో ఇతర దేశాలు, రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఇదే ఆసుపత్రిలోని ఇసోలేషన్లో ఉంచి మెరుగైన సేవలందించారు.
జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు..
బొనకల్లు ఆసుపత్రి అందించిన ఉత్తమ సేవలకు గాను జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. 2019-20, 2020-21 సంవత్సరాల్లో కాయకల్ప అవార్డులు సొంతం చేసుకున్నది. 2020-21లో కేంద్ర బృందం ఈ వైద్యశాలను తనిఖీ చేసి ఎన్కాస్ అవార్డును ప్రకటించింది. ఇక్కడి వైద్యుడు తాటికొండ శ్రీకాంత్కు ఉత్తమ సేవా అవార్డు లభించింది. స్టాఫ్నర్సు భవానీకి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డును హైదరాబాద్లో అందజేశారు. ల్యాబ్అసిస్టెంట్ యాకుబ్అలీ కూడా సేవా అవార్డులు అందుకున్నారు.