కూసుమంచి రూరల్, ఏప్రిల్ 7: అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది కూసుమంచి మండలంలోని గోరీలపాడుతండా. రెండేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్గా బానోత్ సరస్వతిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికలో సరస్వతి భర్త బానోత్ శ్రీనివాస్ గెలిచి, ఎంపీపీ పదవిని చేపట్టారు. ఆయా ఎన్నికల్లో గ్రామప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి వారికి కలిసొచ్చింది. ఈ కార్యక్రమం కింద గ్రామాల్లో మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ సుమారు రూ.1.50 కోట్ల విలువైన పనులు చేపట్టారు.
శ్రీనివాస్ గత మండల పరిషత్ పాలక మండలిలో ఎంపీటీసీగా పనిచేయడం ఆయనకు కలిసొచ్చింది. పంచాయతీ పరిధిలోని గోరీలపాడుతోపాటు తుమ్మలతండా, చాంప్లాతండా, వంటిగుడిసెతండాల్లో గత రెండేళ్లలో రూ.75 లక్షలతో 12 సీసీ రోడ్లు, రూ.24 లక్షలతో నాలుగు మురుగునీటి కాలువలు నిర్మించారు. ఇక పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభంలో శివారు గ్రామాల్లోని వీధుల్లో మొరం పోయించారు. నిత్యం పారిశుధ్య పనులు చేపడుతున్నారు. విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేశారు. ఏటి పక్కన గుట్టపైన వైకుంఠధామం నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.12.50 లక్షలతోపాటు అదనంగా ఖర్చుచేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని ఎకరం విస్తీర్ణం భూమిని చదును చేసి పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కులో నాటడానికి ఏపీలోని కడియం నర్సరీ నుంచి మొక్కలు తెప్పించారు. దీనికి ప్రభుత్వం కేటాయించిన రూ.లక్షతోపాటు ఎంపీపీ అదనపు నిధులు సమకూర్చారు. డంపింగ్యార్డు ఏర్పాటుకు రూ.2 లక్షలు ఖర్చు చేశారు.
రెండేళ్లలో 80 శాతం హామీలు నెరవేర్చాం..
‘రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 80 శాతం నెరవేర్చాం. తాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ ఏడాది అమలు చేస్తాం. దీనికోసం స్థలం కూడా సేకరించాం. సొంత నిధులతో ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాం.’
-బానోత్ శ్రీనివాస్, ఎంపీటీసీ, గోరీలపాడుతండా (ఎంపీపీ)
ప్రజలకు అండగా నిలిచాం..
‘మా పంచాయతీలో ప్రజలకు మేము, మాకు ప్రజలు పరస్పరం అండగా ఉంటున్నాం. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీపడ లేదు. గ్రామంలో సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.’
-బానోత్ సరస్వతి, సర్పంచ్, గోరీలపాడుతండా
కష్టసుఖాల్లో అండగా నిలిచారు
‘సర్పంచ్ సరస్వతి, ఎంపీటీసీ శ్రీనివాస్ దంపతులు కేవలం అభివృద్ధి పనుల్లోనే కాకుండా ప్రజల కష్టసుఖాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కూడా సహకరిస్తున్నారు.
-బానోత్ సుధీర్కుమార్, గ్రామస్తుడు