మంథని, ఏప్రిల్15 : ఇసుక అక్రమ రవాణాపై నియంత్రణ కరువైందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇసుకను దోచుకుపోతున్నారని మాట్లాడిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి.. ఇసుకను ఎవరు దోచుకుపోతున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఇసుక లారీలతో ఛిద్రమైన మంథని -పెద్దపల్లి ప్రధాన రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ, నాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక అబద్ధాలు చెప్పిన ప్రస్తుత మంత్రి ఇప్పుడు ఇసుక అక్రమ తరలింపుపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు మరో రకంగా మాట్లాడడం సిగ్గు చేటన్నారు.
అట్టడుగు కుటుంబం నుంచి పైకి వస్తే ఓర్వలేక తనపై అనేక అసత్య ఆరోపణలు చేసి ప్రజలకు దూరం చేశారని వాపోయారు. ఇసుక క్వారీలు, లారీలు తనవేనని ప్రచారం చేశారని, ప్రస్తుతం వందల కొద్ది లారీలు అక్రమంగా ఓవర్ లోడ్తో వెళ్తున్నవి ఎవరివో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక రవాణాతో రోడ్డు మొత్తం పగిలిపోతున్నదని తెలిపారు. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే అకడకడ ఒకటి రెండు లారీలను పట్టుకుంటున్నారని, కానీ వందల కొద్ది లారీలు ఓవర్ లోడ్ వెళ్తున్నాయని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో నీళ్ల కింద ఇసుక వృథాగా పోవద్దని, కేసీఆర్ సరార్ ఇసుక తీసి ప్రజల అవసరాలకు వినియోగించడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇసుక క్వారీలు, లారీల డబ్బులు కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని వాపోయారు. ఇసుక, బియ్యం, స్రాప్ , బెల్లం దందాలకు కాంగ్రెస్ నాయకులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తే, మంత్రి సోదరుడు నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపించారు. ఇసుక రవాణా ఆపాలని సుల్తానాబాద్లో అన్ని పార్టీల నాయకులు దీక్ష చేస్తున్నారని, అదే తరహాలో మంథనిలో కాంగ్రెస్ నాయకులు దీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్, ఏగోలపు శంకర్గౌడ్, కాయితి సమ్మయ్య, గొబ్బూరు వంశీ, ఆసిఫ్ పాల్గొన్నారు.