మంథని, ఏప్రిల్ 11: కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సాగునీరు లేక పంటలు ఎండుతున్న రైతుల పక్షాన దీక్షలు చేస్తే కేసులు పెట్టిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ మండిపడ్డారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలేను అవమానించిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. తనకు కుర్చీలు, అధికారం ముఖ్యం కాదని, మంథని నియోజకవర్గంలో అధికంగా ఉన్న జాతులకు రాజ్యాధికారం తీసుకు రావాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మంథనిలో ఫూలే 197 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథనిలో ఫూలే విగ్రహానికి పుట్ట మధూకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ అంటేనే మహనీయుల మాసంగా పిలుస్తారని, ఈ నెలలోనే దొడ్డి కొమురయ్య, బాబు జగ్జీవన్రామ్, జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు జన్మించారన్నారు. సమా జం కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవడం మనందిరి బాధ్యత అని చెప్పా రు. మహనీయుల చరిత్రను ఇంకా తెలుసుకోవడంతో పాటు సమాజానికి కూడా తెలియజేసే లా మహనీయుల స్ఫూర్తి దీక్ష తీసుకున్నట్లు తెలిపారు.
ఈ దీక్షను ప్రత్యేక డ్రెస్ కోడ్లో ఉంటూ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగిస్తామని, ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఫూలే, అంబేద్కర్ చరిత్ర తెలియకపోవడం వల్లే మంథని నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా బానిసలుగా ఉన్నారని, దీని వల్ల 3 శాతం ఓట్లు ఉన్న ఒకే కుటుంబం రాజ్యమేలుతుందన్నారు. పూలేతోపాటు అంబేద్కర్, కుమ్రం భీం మహానీయుల విగ్రహాలను పెట్టకుండా పోలీస్స్టేషన్లో పెట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, అధికారులు వాటిని పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. తమకు కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి తెలుసనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తగరం సుమలత, బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, తగరం శంకర్లాల్, ఎగోలపు శంకర్గౌడ్, పూదరి సత్యనారాయణ, పెగడ శ్రీనివాస్, మందల రాజిరెడ్డి, అత్తె చంద్రమౌళి, గొబ్బూరి వంశీ పాల్గొన్నారు.