కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమన్న సూక్తి స్ఫూర్తిగా తమ కొలువుల కల సాకారానికి యువత తీవ్రంగా శ్రమిస్తున్నది. కొన్ని దుష్టశక్తులు తమ స్వార్థానికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడం, ఆవెంటే నిరుద్యోగుల మేలు కోరి ప్రభుత్వం పరీక్షను రద్దు చేసినా ఆత్మవిశ్వాసంతో ప్రిపేరవుతున్నది. ప్రతిపక్షాల కుట్రలు, అసత్య ఆరోపణలు లెక్క చేయకుండా సర్కారుపై సడలని నమ్మకంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నది. ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రంథాలయంలో చూసినా వందలాది మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండడం కనిపిస్తున్నది. ఇంకా సకల వసతులు కల్పించడంతో పాటు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉన్నదని, పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పిన మాటలను విశ్వసిస్తున్నామని ధీమాగా చెబుతున్నారు.
-కరీంనగర్, మార్చి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తపల్లి
యువత కొలువుల కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ఈ క్రమంలో ఇటీవలే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి సుమారు 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జంబో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువత కొద్దిరోజులుగా పుస్తకాలతో కుస్తీపడుతున్నది. ఇప్పటికే చాలా మంది గ్రూప్-1 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించారు. ఉదాహరణకు ఒక్క కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో ప్రిపేరైన వారిలో 30 మంది అర్హత సాధించారు. అయితే టీఎస్పీఎస్సీలో పనిచేసే ఒకరిద్దరి ప్రమేయంతో ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో నిరుద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది.
రీ నోటిఫికేషన్ గడువును ప్రకటించింది. పేపర్ లీకేజీతో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా యువతీ యువకులు ఉద్యోగాలు సాధించేందుకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేస్తున్నా లైట్గా తీసుకొని విజయం సాధించేందుకు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. జోనల్ వ్యవస్థ తెచ్చి బీఆర్ఎస్ సర్కారు స్థానికతకు పెద్దపీట వేసిందని, స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసిందని సంతో షం వ్యక్తంచేస్తున్నారు. నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేలా తెలంగాణ సర్కారు భారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నదని, ఒకరిద్దరు చేసిన తప్పువల్ల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, అయినా తెలంగాణ సర్కారు వేగంగా స్పందించి సరైన నిర్ణయం తీసుకొన్నదని పేర్కొంటున్నారు.
ప్రతిభ ఉన్న యువతకు మేలు చేయాలన్న ఆలోచనతోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించిన పోస్టులకు ఇంటర్వ్యూలను సైతం ఎత్తివేసిందని, ఉద్యోగార్థుల కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి చేయూతనందిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదాన్ని వ్యవస్థ అంతటికీ ఆపాదించడం సరికాదని, ఈ కుట్రను ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ గమనించాలని చెబుతున్నారు. ఏదేమైనా సమయం వృథా చేసుకోకుండా ప్రిపేర్ కావాలని సూచిస్తున్నారు.
గ్రంథాలయాల భరోసా
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు బాసటగా నిలుస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ప్రైవేట్ హాస్టల్స్తో పాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు స్టడీ సెంటర్లా సేవలందిస్తున్నాయి. కరీంనగర్ ల్రైబ్రరీకి ప్రతిరోజు వెయ్యిమంది నిరుద్యోగ యువత ఇక్కడికి వచ్చి చదువుకుంటుండగా, సిరిసిల్ల ల్రైబ్రరీకి 600 మంది దాకా వస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి గ్రంథాలయాల్లోనూ వందకుపైగా అభ్యర్థులు ఉంటున్నారుఉ. ఈక్రమంలో వారికి అవసరమైన అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్ను అందుబాటులో ఉంచడంతోపాటు అవసరమైన పుస్తకాలను అడిగిన వెంటనే అందిస్తూ ఉద్యోగులు ప్రోత్సహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అభ్యర్థులకు కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ చొరవతో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ చిట్టిరెడ్డి మమతారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు.
అందుబాటులో వేలాది పుస్తకాలు
కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ప్రతిరోజు సుమారు వెయ్యి మందికి పైగా అభ్యర్థులు చదువుకొనేందుకు వస్తుంటారు. వీరి కోసం 76,175 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు మీడియం 41,949, ఇంగ్లిష్ మీడియం 20,864, హిందీ 8,467, ఉర్దూ 4,434, సంస్కృతం 225, ఇతర లాంగ్వేజ్లు 236 పుస్తకాలు ఉండగా, 9,687 మందికి మెంబర్షిప్ ఉంది. ప్రతిరోజూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ దినపత్రికలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇక్కడ యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ఏడు గదులను కేటాయించారు. విద్యార్థినులకు -2, యువకులకు -4, లైబ్రరీ కోసం వచ్చే వారికి -ఒక గదిని కేటాయించారు.
ఆధునిక సమాచారం కోసం 12 కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చారు. రాత్రివేళల్లో ఆరుబయట చదువుకొనే వారి కోసం హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. ల్రైబ్రరీకి ఎక్కువగా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే వస్తుండడంతో వారికోసం నగరపాలక సంస్థ సహకారంతో 5కే భోజనాన్ని అందిస్తున్నారు. తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయం, మంథని, రామగుండం, సుల్తానాబాద్ గ్రంథాలయాల్లో కాంపిటేటివ్ పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచారు. గోదావరిఖని బ్రాంచ్లో 3 కంప్యూటర్లు, మంథని బ్రాంచ్లో 2 క్ంయపూటర్లు, పెద్దపల్లిలో జిల్లా గ్రంథాలయ సంస్థలో ఒకటి, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మరొక కంప్యూటర్ను అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ ద్వారా వారికి కావాల్సిన ప్రతీ పుస్తకం అందేలా చొరవ చూపుతున్నారు. జిల్లాలోని 10 గ్రంథాలయాల్లో 20, 478 పుస్తకాలు ఉండగా కాంపిటీటివ్ పుస్తకాలు 4832 పుస్తకాలున్నాయి. 8,180 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇటీవల 50 రీడింగ్ ప్యాడ్స్ సమకూర్చారు.
మరింత పటిష్టంగా పరీక్షలు నిర్వహించాలి
నేను ఎంఏ (పొలిటికల్ సైన్స్) చేశా. ఏడాది నుంచి ఉద్యోగాల కోసం సన్నద్ధమవు తున్నాం. ప్రస్తుతం బీఎడ్ చేస్తూనే గ్రూప్-2తోపాటు, లెక్చరర్ పోస్టు కోసం ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్-1తోపాటు మరో రెండు పరీక్షలు రద్దు చేశారని తెలియగానే కొంత బాధకలిగింది. అయితే లీక్ అయిన ప్రశ్నాపత్రంతో జరిగిన పరీక్షను రద్దు చేయడమే ఉత్తమం. పరీక్షల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు పెద్దగా ఇబ్బంది లేదు కానీ, వేరే ఉద్యోగాలు చేస్తూ ఉన్నత పోస్టుల కోసం సెలవులు పెట్టి సిద్ధమైన వారికి తీవ్ర వేదనను మిగిల్చిందనే చెప్పాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు మోసం చేయడంతోనే ఇంత సమస్య వచ్చింది. వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే వారిపై నిఘాపెట్టలేని అధికారులపై చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహించాలి. ఏదేమైనా యువత కుంగిపోకుండా మళ్లీ పరీక్షలకు సన్నద్ధం కావాలి.
– జీ రమ, గ్రూప్-2, లెక్చరర్ పోస్టు ఉద్యోగార్థి
కేటీఆర్ను విశ్వసిస్తున్నా..
మంత్రి కేటీఆర్పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. పేపర్ లీకేజీ వ్యవహారంతో ఇద్దరు చేసిన తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఎటువంటి వదంతులను నేను నమ్మడం లేదు. పరీక్షలను మరోసారి నిర్వహిస్తామని, అత్యంత పారదర్శకత ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలను నమ్ముతున్నా. ఆయన ఇచ్చిన భరోసాతో మరోసారి పరీక్షలకు ప్రిపేరవుతున్నా. ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఉంది.
– వేదాంత్, సిరిసిల్ల
ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో ఇప్పటి వరకు పారదర్శకంగానే ఉద్యోగాల భర్తీ జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఏఈ, ఏఈఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ప్రకటించారు. ఈ రెండు పోస్టులకు సంబంధించిన పరీక్షలు రాశాను. స్కోర్ బాగా చేశాను అన్న నమ్మకం ఏర్పడింది. ఏదో ఒక ఉద్యోగం వస్తుందనిపించింది. ఇంతలోనే లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. కొంత నిరుత్సాహం కలిగింది. అయినా నమ్మకం సడలిపోలేదు. ముందు అందరిలాగే నేను ప్రభుత్వాన్ని తప్పుపట్టాను. ఆలోచించి చూస్తే, వ్యక్తులు చేసిన పాపాన్ని ప్రభుత్వానికి రుద్దడం, ప్రభుత్వాన్ని ఆపాదించడం సరికాదు అనిపించింది.
ప్రభుత్వం ఏడాది నుంచి నిరంతరంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉన్నది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి అన్ని సౌకర్యాలు కల్పించింది. గ్రంథాలయాల్లో సౌకర్యాలు కల్పించారు, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. ఇంత చేసి చివరి నిమిషంలో తప్పిదానికి పాల్పడుతుందా..? ఒకవేళ పాల్పడితే ప్రభుత్వం క్రెడిబులిటీ పోదా..? ఏ ప్రభుత్వమైనా తన క్రెడిబులిటిని పణంగా పెడుతుందా..? అది ఎన్నికలు జరగనున్న ఈ సంవత్సరంలో అలా ప్రవర్తిస్తుందా..? అలా ప్రవర్తించే అవకాశమే లేదు. కేవలం ఇద్దరు వ్యక్తుల అత్యాశ వల్ల మాత్రమే జరిగింది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు మాత్రం శాస్తి జరగాలి. కొన్ని సమయాల్లో ఎవరో చేసిన తప్పుకు మనం బాధపడక తప్పదు. అందుకే ఎవరినీ నిందించకుండా మళ్లీ ఏఈ, ఏఈఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్నా.
– జీ మహేశ్, ఏఈ, ఏఈఈ ఉద్యోగార్థి
రాజకీయం చేస్తున్నారు..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. పరీక్షల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులు మాత్రం వారి దుష్ప్రచారాలను నమ్మడం లేదు. రోజుకు దాదాపు 600 మంది అభ్యర్థులు గ్రంథాలయానికి వస్తున్నారు. పేపర్ లీకేజికి ముందు ఎలా వచ్చారో ఇప్పుడు అలాగే వస్తూ ప్రిపరేరవుతున్నారు.
– ఆకునూరి శంకరయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
పారదర్శకంగా నియామకాలు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ గతంలో పారదర్శకంగా నిర్వహించారు. పోటీ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీకి మంచి పేరున్నది. ఒకరిద్దరు చేసిన తప్పులను టీఎస్పీఎస్సీతోపాటు ప్రభుత్వంపై రుద్దడం సరికాదు. నేను కష్టపడి చదివి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. పేపర్ లీకేజీతో పరీక్షను రద్దు చేయడం బాధగానే ఉన్నది. కానీ, మళ్లీ చదివి తప్పకుండా పాసవుతా. లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. నిరుద్యోగుల జీవితాలతో పార్టీల నాయకులు రాజకీయాలు చేయడం మానుకోవాలి. విద్యార్థి, యువత ఆందోళన పడద్దు. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలి. తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలి.
– ఆర్ దిలీప్, పెద్దపల్లి
ప్రభుత్వంపై నమ్మకం ఉంది..
నేను గ్రూప్స్కు ప్రిపేరవుతున్న. గత జనవరి నుంచి సిరిసిల్ల గ్రంథాలయానికి వస్తున్న. ఇక్కడ చాలా మంచి వసతులు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. పేపర్ లీకేజీ బాధాకరమైన అంశం. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉంది. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సారి కచ్చితంగా ఉద్యోగం సాధిస్తా.
– ఎం జాన్సీ, సర్దార్నగర్, సిరిసిల్ల
రద్దు చేయడం సబబే
ఉద్యోగ నియామకాల్లో భా గంగా టీఎస్పీఎస్సీలో ఒకరిద్దరు చేసిన తప్పుతో పేపర్ లీక్కావడం బాధించింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం 100 శాతం సరైందే. లేదంటే అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన నేను గ్రూప్స్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్ గతంలో ఎప్పుడూ చూడలేదు. మళ్లీ చూస్తామన్న నమ్మకం లేదు. అందుకే ఈసారి కచ్చితంగా ఉద్యోగం సాధించేందుకు కష్టపడుతున్నా, పేపర్ లీకేజీ ఘటనను ఎప్పుడో మరిచిపోయాం. రాజకీయ ఆందోళనలు విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపవు.
– సాయికిరణ్, సిరిసిల్ల
అన్ని రకాల పుస్తకాలు ఉన్నయ్..
నేను జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నా. గ్రంథాలయంలో అందుకు సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇక్కడ సౌకర్యాలను సైతం మెరుగు పరిచారు. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇటీవల జిల్లా కలెక్టర్, గ్రంథాలయ చైర్మన్ చెప్పారు. తప్పకుండా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సాధిస్తా.
-తాళ్ల శైలజ, అభ్యర్థిని, పెద్దపల్లి
గ్రూప్-1 కు మళ్లీ అర్హత సాధిస్తా
కరీంనగర్లో బీటెక్ పూర్తి చేసిన నేను ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించా. వీటితోపాటు ఎస్ఐ, పీసీ పరీక్షల్లో సైతం అర్హత పొందా. ప్రశ్నా పత్రాలు లీక్ కావడంతో పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం మళ్లీ చదువుతున్నా. తిరిగి తప్పకుండా గ్రూప్-1లో అర్హత సాధిస్తాననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి చదువుకోవడమే నా పని. ఉద్యోగం సాధించేందుకు నిరంతరం కష్టపడుతున్నా. జాబ్ కొట్టి తల్లిదండ్రులు, నా కలను నెరవేర్చుకుంటా. నిరుద్యోగ యువకుల జీవితాలతో రాజకీయ పార్టీలు చెలగాటమాడడం మానుకోవాలి.
– పీ సంజయ్, కరీంనగర్
ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవడం లేదు..
రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు ప్రశ్న పత్రాల లీకేజీపై రాద్దాంతం చేస్తున్నాయి. లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తుంది. లీకైన పరీక్షలను ప్రభుత్వం మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమై తేదీలను కూడా ప్రకటించింది. గతంలో చెల్లించిన పరీక్ష ఫీజులతోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి విద్యార్థులపై ఆర్ధిక భారం పడకుండా చర్యలు తీసుకుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగుల జీవితం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండడంతో ప్రతిపక్షాలు ఎంత రాద్దాంతం చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. యువతీ యువకులు సైతం ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవడం లేదు. గ్రంథాలయానికి వచ్చే వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– పొన్నం అనిల్కుమార్గౌడ్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
స్టడీ సెంటర్ల గడువును పొడిగించాలి
నేను కరీంనగర్లోని ఎస్సీ స్టడీ సెంటర్లో ప్రిపేర్ అయ్యా. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసి అర్హత సా ధించా. పరీక్షను రద్దు చేయడంతో నేను మళ్లీ ప్రిపేర్ కావాల్సి ఉన్నది. స్టడీ సెంటర్లతోపాటు లైబ్రరీల్లో చదువుకొనే నిరుద్యోగులు, యువతలో ఎక్కువమంది నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. గ్రూప్-1కు సంబంధించిన పరీక్షతోపాటు మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సెంటర్ల గడువును పొడిగించాలి. దీంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పుతుంది.
– నక్క పరశురాం, గ్రూప్-1 అభ్యర్థి, మొగిళిపాలెం (తిమ్మాపూర్)
ఎస్ఐ ఉద్యోగం సాధిస్తా..
పోలీస్ ఉద్యోగం సాధించి సమాజానికి సేవ చేయాలనేది నా చిన్ననాటి కల. అందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నా. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాల నియామకంలో ఎస్ఐతో పాటు, కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించి మెయిన్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నా. అలాగే ఇటీవల గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా అందులో సైతం అర్హత సాధించా. కానీ నాకు పోలీస్ కావాలనే కోరిక చాలా ఉంది. అందుకోసం ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నా. నిరుద్యోగ యువతకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. పరీక్షల లీకేజీతో నిరుద్యోగుల ఎవరూ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోలేదు.
– పాక లోహిత, మంచిర్యాల
గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా
మాది పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీ. నేను గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా. గ్రూప్స్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయం లో అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్ పేపర్ లీకుల గురించి తెలిసింది. కానీ, ఎప్పుడూ అలా జరగవు. కొంత మంది చేసే తప్పుల వల్ల అలా జరుగుతాయి. మేం రాసే సరికి ఎగ్జామ్స్ సజావుగానే సాగుతాయనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ప్రిపేరవుతున్నా.
-చల్లా జ్యోతి, రైల్వే కాలనీ పెద్దపల్లి