కొత్తపల్లి, మార్చి 28: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాలు ఆ దిశగా కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నాయని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం గ్రంథాలయంలో చేపడుతున్న షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ 14న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు వారధి మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ యాప్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వెనువెంటనే అందించేలా యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి సైతం ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్మార్ట్సిటీలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా లైబ్రరీలో వెంటనే వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారందరూ ఒకే విధమైన (గ్రూప్ -1) పరీక్ష మాత్రమే లక్ష్యంగా కాకుండా ప్రతి పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు.
లైబ్రరీకి వచ్చే వారి కోసం తాగునీరు, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవిలో తాగునీరు, ఏసీ, కూలర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ మాట్లాడుతూ, గ్రంథాలయంలో సౌకర్యాలను కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, ఉద్యోగార్థులకు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారంతో గ్రంథాలయం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుదని అన్నారు. తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి రూ. 63 లక్షలు మంజూరు చేసిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరి సరిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.