ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీలు కట్టి, ఆశీర్వదించారు. ఉదయం నుంచే మహిళలు రాఖీలు కొనుగోలు చేసుకుని తమ సోదరుల ఇండ్లకు వెళ్లి పండుగను సంబురంగా జరుపుకున్నారు. పలు చోట్ల ఎమ్మెల్యేలు, అధికారులకు స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
– కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డికి క్రైస్తవ, ముస్లిం మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టారు. సమీకృత కలెక్టర్లోని కలెక్టర్ క్యాంపు ఆఫీస్లో అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ, పెద్దపల్లి అంగన్వాడీ కేంద్రం చిన్నారులు, మహిళలు జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లిలోని స్థానిక షిర్డీ బాబా ఆలయంలో మహిళలు బాబాకు రాఖీ కట్టి పూజలు చేశారు. గోదావరిఖని తిలక్నగర్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంట్లో ఆయన సోదరీమణులు, కుమార్తె ఉజ్వల బొట్టు పెట్టి హారతి పట్టి రాఖీలు కట్టారు. అనంతరం ఎమ్మెల్యే సోదరీమణుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్బాబుకు మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, గంగం స్వరూపారాణి, రేవతి, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, జల, బీఆర్ఎస్ ముస్లిం మహిళా నాయకురాలు, రుద్రంగి మండల కో ఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం రాఖీ కట్టి స్వీటు తినిపించారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్కు ఆయన సోదరి విజయ రాఖీ కట్టి ఆశీర్వదించారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు ఆయన సోదరితో పాటు పలువురు మహిళలు రాఖీలు కట్టారు.
పెద్దపల్లి, ఆగస్టు 31: అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీ పండగ రోజు రాఖీ కట్టడం.. అందుకు గిఫ్ట్గా సోదరులు సోదరీమణులకు నగదు, వస్తు రూపేనా బహుమతి ఇవ్వడం అనవాయితీగా వస్తున్నది. అయితే, పెద్దపల్లిలో మాత్రం పలువురు డిజిటల్ పే ద్వారా కానుకలు అందించారు. ముత్యాల పోశమ్మవాడకు చెందిన మంథని నర్సింగ్ తనకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు యూపీఐ ద్వారా కట్నం పెట్టారు.
కోనరావుపేట, ఆగస్టు 31: రాఖీ పండుగ రోజూ ఆ చిన్నారి ప్రకృతి ప్రేమను చాటుకున్నది. పర్యావరణహితంగా రంగు రంగుల కాగితాలతో తాను తయారు చేసిన రాఖీలను 105 వృక్షాలకు కట్టి పర్యావరణ ప్రేమికుల ప్రశంసలు అందుకున్నది. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రకాశ్ కూతురు బ్లేస్సీ తన తండ్రి బాటలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నది. గతంలో విత్తన బంతులను తయారు చేసి అడవుల్లో వెదజల్లింది. హరితహారంలో భాగస్వామవుతూ ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్, మంత్రి కేటీఆర్ మన్ననలు పొందింది. ఇలా బ్లేస్సీ చెట్లకు రాఖీలు కడుతూ మానవాళికి చెట్లే నూరేళ్ల రక్షా అని
వినూత్నంగా పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పింది.
కొత్తపల్లి, ఆగస్టు 31 : కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులు, నిరుద్యోగ యువతులు గురువారం రాఖీ పండగ సందర్భంగా సీఎం కేసీఆర్ కటౌట్కు రాఖీ కట్టి అభిమానం చాటుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కటౌట్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో పోలీస్ షీ టీం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తన కుటుంబం గురించి వివరించారు. ‘ఈరోజు రాఖీ పండుగ. మాది ఉమ్మడి కుటుంబం. తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నరు. రాఖీ కట్టడానికి ఈరోజు నాదగ్గర వారు లేరు. నా అక్కాచెల్లెళ్ల స్థానంలో మీరు రాఖీ కట్టండి. నేను మీకు రక్షగా ఉంటా’ అని చెప్పడంతో విద్యార్థినులు ఎస్పీకి ఉత్సాహంగా రాఖీ కట్టారు.
రామడుగు, ఆగస్టు 31 : కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని పందికుంటపల్లిలో మాజీ సర్పంచు కటుకం రవీందర్ రెండేళ్ల క్రితం అకాల మరణంతో కలతచెందిన స్థానిక యువకులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయా, గురువారం రక్షాబంధన్ సందర్భంగా ఆయన తోబుట్టవులు, ఆడబిడ్డలు విగ్రహానికి రాఖీ కట్టారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం సృష్టి ఉన్నంత వరకు ఉంటుందని నిరూపించారు.
రామడుగు, ఆగస్టు 31 : రామడుగు మండలంలోని పందికుంటపల్లిలో మాజీ సర్పంచ్ కటుకం రవీందర్ రెండేళ్ల క్రితం అకాల మరణంతో కలతచెందిన స్థానిక యువకులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రక్షాబంధన్ సందర్భంగా ఆయన తోబుట్టవులు, ఆడబిడ్డలు విగ్రహానికి రాఖీ కట్టారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం సృష్టి ఉన్నంత వరకు ఉంటుందని నిరూపించారు.
హుజూరాబాద్టౌన్, ఆగస్టు 31 : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ కోడిగూటి శారద హుజూరాబాద్ పట్టణంలోని అంబేదర్ విగ్రహానికి రాఖీ కట్టి అభిమానం చాటుకున్నది. ‘పదవి మీ రిచ్చిన భిక్ష.. ఈ హుందా తనం మాకు రక్ష.. నేను మీకు కట్టే రాఖీ నా భారతీయ సోదరులకు రక్ష’ అని చెప్పింది.