జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 20 : దేశ సేవ చేయాలనుకునే 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు భారత వాయుదళంలో అగ్నివీరులుగా చేరడానికి మంచి అవకాశం వచ్చింది. మార్చి 9న యువతులు, మార్చి 12న యువకులకు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో అర్హత పరీక్ష ఉన్నది. దీనిపై శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో యువతకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వాయుసేన అధికారి సందీప్ విద్యార్థులకు సూచనలు చేశారు. అగ్నివీరులుగా చేరేందుకు ఇంటర్మీడియెట్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలని, 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 మధ్యలో జన్మించిన వారు అర్హులను చెప్పారు. పూర్తి వివరాల కోసం www.agnipathvayu.cdac.in వెబ్సైట్లో చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సత్తెమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ ఏ అశోక్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ పీ రాజు, వైస్ ప్రిన్సిపాల్ ఆడెపు శ్రీనివాస్, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.