అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. సాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. మొన్నటిదాకా బంగారు పంటలు పండించిన అనేక ప్రాంతాల్లో తండ్లాట మొదలైంది. ఎగువ నుంచి జలాలు రాక, చెరువులు, కుంటల భరోసా లేక ఎవుసం ఆగమైతున్నది. చాలా మండలాల్లో పంట పొలాలు ఎండుతున్నాయి. ఆరుగాలం శ్రమంచిన పంటలు దెబ్బతినడం చూసిన అన్నదాతల కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాటిని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో కొందరు బావుల్లో పూడిక తీయిస్తే.. మరికొందరు ఏ ఆధారం లేక పంటలను వదిలేస్తున్నారు. నాడు కేసీఆర్ సర్కారు పాలనలో ఏ బాధా లేకుండా రెండు పంటలు పండించుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ల కోసం గోస పడుతున్నామని వాపోతున్నారు. మున్ముందు ఎండలు తీవ్రమవుతాయని, సకాలంలో నీళ్లు రాకపోతే ఎక్కడ కూడా యాసంగి పంటలు చేతికి వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్డెక్కి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. లేకుంటే పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తారని హెచ్చరించారు. – కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్