ఎలబోతారం గోసపడుతున్నది. నాడు పసిడి పంటలతో కళకళలాడిన ఆ పల్లె, ఇప్పుడు సాగునీటికి అల్లాడిపోతున్నది. ఇన్నాళ్లూ గ్రామానికి ఆదరువుగా ఉన్న ఊరచెరువు ఈ సారి భరోసా ఇవ్వకపోవడంతో వంద ఎకరాలను బీడు పెట్టాల్సి వచ్చింది. ఇక ఎస్సారెస్పీ డీ-89 కెనాల్ ద్వారా వారబందీ పద్ధతిన విడిచే నీటికి బ్రేక్ పడడంతో దాదాపు 200 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు భూగర్భజలాలు కూడా తగ్గుతుండడంతో 600 ఎకరాలు దెబ్బతినే ముప్పు కనిపిస్తున్నది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పంటలను వదిలేయగా, మరికొందరు చేతికందివచ్చిన పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 26 : కరీంనగర్ నియోజకవర్గంలో సాగునీటికి కటకట మొదలైంది. మరీ ముఖ్యంగా రూరల్ మండలం ఎలబోతారం అల్లాడిపోతున్నది. గ్రామంలో 900 ఎకరాలపైనే సాగు భూములు ఉండగా, అందులో వంద ఎకరాల వరకు ఊర చెరువు కింద సాగవుతున్నది. అయితే గత కేసీఆర్ సర్కారు పాలనలో ఎస్సారెస్పీ డీ89 కెనాల్ ద్వారా ఆ చెరువును నింపారు. దాంతో రైతులు ఏ బాధా లేకుంట పంటలు పండించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, సేద్యానికి భరోసా ఇవ్వకపోవడంతో రైతులు డైలామాలో పడిపోయారు.
ఆశించిన స్థాయిలో ఊరచెరువులో నీళ్లు లేకపోవడంతో పరిస్థితిని ముందే ఊహించి ఈ యాసంగిలో సాగుకు దూరంగా ఉన్నారు. వంద ఎకరాలను బీడుగానే ఉంచారు. ఇక ఎస్సారెస్పీ డీ 89 కాలువ కింద మరో 200 ఎకరాలు సాగవుతుండగా, కేసీఆర్ సర్కారు ఏటా యాసంగిలో వారబంధీ పద్ధతిన నీరిచ్చేది. కానీ, ఈసారి అది కూడా గాడి తప్పింది. ఇప్పటివరకు మూడుసార్లు తడులను అందించాల్సి ఉండగా, 21 రోజుల కింద మూడు రోజులపాటు మాత్రమే విడుదల నీటిని చేశారు. ఇప్పటివరకు మరో రెండు విడుతలు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వకుండా చేతులెత్తేశారు. దీని ప్రభావం అంతటా కనిపిస్తున్నది.
బోరుబావులు, బావుల ఆధారంగా 600 ఎకరాల వరకు ఏటా సాగవుతుండగా, ఈ సారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. భూగర్భజలాలు అడుగంటుతుండడం చూస్తే చివర వరకు పంటలు చేతికొచ్చుడు అనుమానంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే గ్రామంలో పొలాలు, మక్క చేన్లు ఎండిపోతుండగా, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలో..? తెలియక సతమతమవుతున్నారు. తాము కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏ బాధా లేకుండ వ్యవసాయం చేసుకున్నామని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి సమస్య అప్పుడే మొదలైందని మండిపడుతున్నారు. పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
నాకు ఐదెకరాల భూమి ఉంది. ఎస్సారెస్పీ కెనాల్ నుంచి నీళ్లు వస్తాయనే నమ్మకంతో వరి, మక్క వేసిన. వారబందీ పద్ధతిన నీళ్లిస్తామని చెప్పిన అధికారులు చెప్పి మాట తప్పిన్రు. నా పంట ఎండుతున్నది. చేతికి వస్తుందనే ఆశ లేదు. పదేండ్లుగా ఏ బాధా లేకుంట ఎవుసం చేసుకున్న. కానీ ఈ సారి ఇట్ల అయితదని అనుకోలె.
– వొల్లాల రాజిరెడ్డి, రైతు (ఎలబోతారం)
నాకున్న రెండెకరాల్లో వరి వేసిన. నీళ్లు లేక పంట ఎండుతున్నది. వారబందీ పద్ధతిన నీరందిస్తే మా పంటలకు చావులేకుండేది. గతంలో ఎపుడు ఇంత ఇబ్బంది కాలే. పుష్కలమైన జలాలతో ఎవుసం చేసుకున్న. ఇప్పుడు కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఇలా అయితే ఎవుసం కష్టమే. ఇప్పటికైనా నీళ్లు అందించాలి.
– బుచ్చాల లచ్చయ్య, రైతు (ఎలబోతారం)
పదేండ్లుగా రంది లేకుంట ఎవుసం చేసుకున్నం. కానీ ఈ సీజన్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెరువుల నీళ్లు లేక ఎకరం భూమి బీడుగా వదిలేశా. కాలువ కింద రెండెకరాలు వేస్తే నీళ్లు రాక ఎండిపోతంది. వారానికి నాలుగు రోజుల తడి ఇస్తే సరిపోయేది. కానీ 20 రోజుల కింద ఇచ్చి మరిచిపోయిన్రు. చేతికచ్చిన పంట ఎండిపోతుంటె గుండె తరుక్కుపోతున్నది. ఇప్పటికైనా అధికారులు నీటిని విడుదల చేయాలి.
– కొల్లాపూరి శంకయ్య, రైతు (ఎలబోతారం)
ఎస్సారెస్సీ డీ 89 కెనాల్ కింద వారబందీ పద్ధతిన నీళ్లు వస్తాయనే నమ్మకంతో ఎకరంలో వరి వేసిన. కానీ, అధికారులు నీళ్లు విడుదల చేస్తలేరు. 20 రోజుల కింద ఇచ్చి మరిచిపోయిన్రు. ఇలా అయితే పంట ఎలా చేతికివస్తుంది? మొత్తం పంట ఎండిపోయింది. మేకల మేతకు వదిలేసిన. కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఇలా అయితే రైతు ఎవుసం విడిచిపెట్టుడే అయితది.
– చల్ల ప్రభాకర్ రెడ్డి, రైతు (ఎలబోతారం)