తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 26: ఒకప్పుడు యాసంగి వచ్చిందంటే ఎండాకాలంలో నీటి ఎద్దడి, విద్యుత్, ఎరువుల సమస్య దృష్ట్యా పంటలు వేయడానికి రైతులు వెనుకంజ వేసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ప్రభుత్వం రైతులకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పంటల సాగు జోరందుకున్నది. ఇక్కడి మహిళా కూలీలతో పాటు నాటు వేసే యంత్రాలు, బీహార్ కూలీలకు డిమాండ్ ఏర్పడింది.
మండలంలో పెరిగిన సాగు విస్తీర్ణం
తిమ్మాపూర్ మండలంలో యాసంగిలో 20వేల ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వానకాలంలో 18వేల ఎకరాలు సాగవగా, ప్రస్తుతం విస్తీర్ణం స్వల్పంగా పెరుగనున్నట్లు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో కూలీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడగా, అక్కడక్కడా నాట్లు ఆలస్యమవుతున్నాయి. రైతులు ఒక్కో కూలీకి రూ.300-500వరకు కూలి చెల్లిస్తుండగా, అక్కడక్కడా ఎకరానికి గుత్తాగా రూ.5వేల చొప్పున ఇస్తున్నారు. అయినప్పటికీ నాట్లు అన్ని ఒకేసారి ప్రారంభం కావడంతో సమస్య ఏర్పడింది.
అందుబాటులో బీహార్ కూలీలు..
నాట్లు వేసేందుకు మహిళల కొరత తీవ్రంగా ఉండడంతో కొంతమంది మధ్యవర్తులు బీహార్ కూలీలను వలస తీసుకువచ్చారు. వారికి ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నారు. పది నుంచి పదిహేను మంది చొప్పున ఉన్న కూలీల బృందం రోజుకు మూడు నుంచి ఐదు ఎకరాల్లో నాటు వేస్తున్నారు. అలాగే నాట్లు వేసే యంత్రాలు సైతం అందుబాటులో ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా రైతులు నాట్లు వేసేందుకు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది.