నభూతో నభవిష్యతి
ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా
నారసింహ వైభవాన్ని నలుదిక్కులా చాటిన అపూర్వ ఘట్టం
యాదాద్రి దివ్య క్షేత్రం పునరవతరణం!
సిద్ధించిన సీఎం కేసీఆర్ మహా సంకల్పం..
యాదాద్రీశుడి నిజరూప దర్శనం..
నేత్రపర్వం.. మహాకుంభ సంప్రోక్షణ పర్వం..
ఓం నమో నారసింహాయ!!
కృష్ణశిలా వైభవం..
ఇల వైకుంఠం మన ఇలవేల్పు నిలయం..
అడుగు మోపిన జన్మధన్యం!!!
వైభవోపేతంగా యాదాద్రి ఆలయ పునరావిష్కారం
యాదాద్రి భువనగిరి, మార్చి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏకశిఖరవాసుడు, స్వయంభు పంచ నారసింహుడు కొలువైన యాదాద్రి క్షేత్రంలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో పునర్నిర్మితమైన ఆలయం పునరావిష్కారం అంగరంగ వైభవంగా సాగింది. వేదమంత్రోచ్ఛారణ, నమో నారసింహాయ స్మరణల నడుమ.. మిథున లగ్నంలో సోమవారం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా జరిగింది. సరిగ్గా 12.30గంటలకు మూలవర్యుల దర్శనభాగ్యం కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా గర్భాలయంలోకి వెళ్లి తొలిపూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఈ మహాక్రతువులో పాల్గొని పునీతులయ్యారు. నవ యాదాద్రిని చూసి భక్తజనులు సంతోషంతో పులకరించిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత స్వామివారిని దర్శించుకుని కరుణాకటాక్షాలు పొందారు.
అసమాన కృషికి సన్మానం
సీఎం కేసీఆర్ ప్రహ్లాద స్వరూపుడై నవ యాదాద్రికి సంకల్పించగా, ఆ మహాయజ్ఞంలో భాగస్వాములై ఇల వైకుంఠాన్ని సాక్షాత్కరింపజేయడంలో ఎందరో నిపుణుల కృషి ఉంది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని కృష్ణ్ణశిలారూపంలో నిక్షిప్తం చేసి, వెయ్యేండ్లు వర్ధిల్లేలా ప్రధానాలయాన్ని పునర్నిర్మించారు. ఆ అసమాన ప్రతిభను, విశేష కృషిని గుర్తిస్తూ ఆలయ పునఃప్రారంభం సందర్భాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి వారిని సన్మానించారు.