Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 18 : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం 10.30 గంటల తర్వాత వచ్చిన ఉద్యోగులను కలెక్టరేట్ గేటు వద్దే నిలిపివేసిన ఘటన ఇప్పుడు కరీంనగర్ అధికార వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అక్కడి జిల్లా యంత్రాంగం తీసుకున్న కఠిన చర్య తరహాలో ఇక్కడ కూడా సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువైన కలెక్టరేట్లోనే సమయపాలన గాడి తప్పుతుండగా, పనుల నిమిత్తం వచ్చే వారు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం నిర్దేశిత సమయానికి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కొందరు అధికారులు, సిబ్బంది తమకు అనుకూలమైన సమయానికే కార్యాలయాలకు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు ముందుగానే వెళ్లిపోతున్నారనే ఫిర్యాదులూ లేకపోలేదు. ఉద్యోగుల హాజరు విధానాన్ని పరిశీలించేందుకు అత్యాధునిక యంత్రాలు వినిగిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారి హాజరు నమోదవుతున్నా ఉద్యోగులు సకాలంలో అందుబాటులో లేకపోతే ఆ వ్యవస్థల ఉద్దేశమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘అధికారి వస్తేనే పని’ అన్న పరిస్థితి?
కలెక్టరేట్లోని కొన్ని విభాగాల్లో ప్రజలు ఉదయం నుంచే వచ్చి అధికారుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తులు, ఫిర్యాదులు, ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాల సమస్యలతో వచ్చే వారికి సంబంధిత అధికారి లేదా సిబ్బంది అందుబాటులో లేకపోతే మళ్లీ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పుడు.. అధికారులు మాత్రం సమయానికి కార్యాలయంలో ఉంటున్నారా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. కలెక్టరేట్ వంటి కీలక కార్యాలయంలో సమయపాలనను కట్టుదిట్టంగా అమలు చేసి, అధికారులు-సిబ్బంది నిర్దేశిత సమయాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.