గోదావరిఖని, డిసెంబర్ 27: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఓటెత్తారు. అభ్యంతరాలు, కోర్టు తీర్పులు, తర్జన భర్జనల మధ్య ప్రశాంత వాతావరణంలో సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం నిర్వహించగా, పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 11 డివిజన్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా, ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఫస్ట్ షిప్టులో వచ్చిన వారు ఉదయం, సెకండ్ షిప్టులో వారు మధ్యాహ్నం, నైట్ షిప్టు డ్యూటీ చేసిన వారు ఉదయమే ఓట్లు వేశారు.
సింగరేణి వ్యాప్తంగా 39,805 ఓట్లకు గాను 37,451 ఓట్లు (95 శాతం) నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్ ముగిసిన అనంతరం ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. రాత్రి 7 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అన్ని కేంద్రాలకు వచ్చిన పోలింగ్ డబ్బాలను ఏజెంట్లకు చూపించాక సీల్ ఓపెన్ చేశారు. అనంతరం 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టారు. 13 యూనియన్లకు 13 డ్రమ్ములు పెట్టి వారికి వచ్చిన ఓట్లను అందులో వేశారు. అనంతరం కౌంటింగ్ చేశారు. ఈ ప్రక్రియ అంతా ముగిసే సరికి అర్ధరాత్రి దాటింది.