పెద్దపల్లి, మార్చి18: పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో పేదల కోసం చందపల్లి, కునారం రోడ్ వద్ద 484 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారని, రిజర్వేషన్ ప్రాతిపదికన లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపికచేశారని చెప్పారు. చిన్న చిన్న పనులు మిగిలి ఉండడం, అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తమకు ఇండ్లు అప్పగించలేదని వాపోయారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇండ్లు అందజేయాల్సి ఉన్నా.. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టి తాత్సారం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పలుమార్లు ఆందోళన చేస్తే సోమవారం ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చారని, తీరా ఇక్కడికి వస్తే పట్టించుకోవడం లేదని, అందుకే నిరసన తెలుపుతున్నట్లు వివరించారు. కాగా, ఆందోళన చేస్తున్న క్రమంలో రంజా న్ ఉపవాసం ఉన్న జమృత్ బేగం స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను వెంటనే దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అనంతరం లబ్ధిదారులు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇండ్లు పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ తెలిపారు. ఎన్నికల కోడ్ సందర్భంగా ఇప్పటిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. 3 నెలలు ఓపిక పడితే, అర్హులందరికీ ఇండ్లు అందజేస్తామని స్పష్టం వివరించారు.