పెద్దపల్లి రూరల్, మే 11: సమస్యల పరిష్కారం కోసం సఖీ కేంద్రాలకు వచ్చే మహిళలకు గౌరవం పెరిగేలా భరోసానివ్వాలని, బాధిత మహిళలకు మనం ఉన్నామనే ధైర్యం కల్పించేలా సఖీ కేంద్రం పనితీరు ఉండాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సనీతా లక్ష్మారెడ్డి సూచించారు. గురువారం ఆమె మహిళా కమిషన్ సభ్యులతో కలిసి జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ముందుగా ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత కాళేశ్వరం క్షేత్రంలో పూజలు చేశారు. అనంతరం పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ శివారులోని వీఎస్ఆర్ ఇటుకబట్టీలను సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ ఒడిశా నుంచి మహిళా కార్మికులు, వారి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ఒడిషా భాషలోనే విద్యాబోధన చేయించాలని, మహిళల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వీరికి అందేలా చూడాలని, తరచూ బట్టీలను సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. తర్వాత జిల్లాకేంద్రానికి చేరుకొని సఖీ కేంద్రాన్ని సందర్శించారు. మొదటిసారిగా వచ్చిన కమిషన్ చైర్పర్సన్కు సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ దారవేన స్వప్న ఆధ్వర్యంలో బృందం సభ్యులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, సంబంధిత అధికారులు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో అక్కడే సమావేశమయ్యారు. రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మహిళలు, బాలికల రక్షణ ఆరోగ్య నియమాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు.
సఖీ కేంద్రానికి వచ్చే బాధిత మహిళలకు మనం ఉన్నామనే భరోసాను ఇచ్చేవిధంగా పనిచేయాలని సూచించారు. పోలీసులు, షీటీంల సహకారం తీసుకొని వచ్చే కేసులన్నింటినీ పరిష్కరించాలని, భార్యాభర్తల గొడవ విషయంలో ఇరువురిని కలిపే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేయాలన్నారు. అవసరమైతే కలెక్టర్తో చర్చించి జడ్జీల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 1129 కేసులు నమోదయ్యాయని, 902 కేసులు పరిష్కారమయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని చైర్పర్సన్కు అధికారులు వివరించారు.
మహిళలు, బాలికలు సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్లైన్ 181, చైల్డ్ హెల్ప్లైన్ 1098పై గ్రామాల్లో విస్త్రృతంగా ప్రచారం చేయాలని, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సఖీ కేంద్రం ద్వారా అందే సేవల వివరాలు ప్రతి ఒకరికీ తెలిసేలా ప్రచారం చేయాలని ఆమె ఆదేశించారు. ప్రేమ, సైబర్కు సంబంధించిన మోసాలపై యువతులు మహిళలు, కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు కఠారి రేవతిరావు, షాహిన్ అఫ్రోజ్, కే ఈశ్వరీభాయి, ఎస్ లక్ష్మి, పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవరావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ఖాన్, పెద్దపల్లి తహసీల్దార్ ఆర్ వెంకటలక్ష్మి బాలల రక్షభవన్ అధికారి సుగుణ, జితేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు.