స్వశక్తి సంఘాల మహిళలు చిరు వ్యాపారాలతో రాణిస్తున్నారు. ఐక్యత, ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ సహకారంతో తోచిన స్థాయిలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశలో పురోగమిస్తున్నారు. జగిత్యాల జిల్లా పరిధిలో 600 మందికిపైగా సబ్సిడీ రుణం పొంది, సొంతంగా యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపారు. అందులో 250 మందికిపైగా యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఒక లక్ష్మీపూర్, జాబితాపూర్లో పరిధిలోనే పదికపైగా ఉండగా, పిండిగిర్ని, పిండి ఉత్పత్తుల కేంద్రం, బిర్యానీ పాయింట్స్, కోల్డ్ఫ్రెష్ ఆయిల్, పెండ్లిల్లో ధరించే తలపాగాలు, ఐరెండ్ల కుండలు, పేపర్ ప్లేట్లు, అగర్బత్తీల తయారీ కేంద్రం ఇలా ఎన్నో యూనిట్లు నడిపిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మొదటి నుంచి ప్రగతిశీల గ్రామం. ఇక్కడి ప్రజలు వ్యవసాయంలో ఉమ్మడి రాష్ట్రంలోనే గొప్ప పేరును సంపాదించారు. ఈ గ్రామానికి చెందిన గర్వందుల భాగ్య, గంగాధర్ భార్యభర్తలు. భాగ్య స్వశక్తి మహిళ సంఘ సభ్యురాలు. ఆమెకు మొదటి నుంచీ ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్న అభిలాష ఉండేది. గ్రామంలో పలువురు మహిళలు మహిళా సంఘాల ద్వారా రుణం తీసుకొని సొంతంగా వ్యాపారం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టడం చూసిన భాగ్య సైతం ఏదైనా ఒక యూనిట్ స్థాపించాలని భావించింది.
వ్యవసాయ గ్రామం కావడంతో కోల్డ్ఫ్రెష్ ఆయిల్ యూనిట్ను ఏర్పాటు చేయాలని అనుకున్నది. అందుకు రూ.పది లక్షలు అవుతాయన్న అంచనాలను అధికారులకు విన్నవించగా, ఏపీఎం ఓదెల గంగాధర్ సహకరించారు. ఏడాది క్రితం 30 శాతం సబ్సిడీపై రుణం మంజూరైంది. వీటితో భాగ్య హన్మాన్ కోల్డ్ఫెష్ ఆయిల్ మిల్ను ఏర్పాటు చేసింది. ఈ మిల్లులో నువ్వులు, పల్లి నూనె తీస్తున్నారు. పూర్తిస్థాయిలో రిఫైన్డ్ చేసి, ఫ్రెష్ ఆయిల్ను వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
మిల్లుకు అనుబంధంగా ఒక రైస్మిల్లును సైతం సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదిగా కోల్డ్ఫ్రెష్ ఆయిల్ మిల్లును భాగ్య విజయవంతంగా నిర్వహిస్తోంది. ‘నువ్వులు, పల్లీలు తీసుకువచ్చి నూనెను పట్టి ఇవ్వమన్నా పట్టిస్తున్నాం. పట్టిన నూనె అడిగినా విక్రయిస్తున్నాం. కిలోకు రూ.పది చొప్పున చార్జీ వసూలు చేస్తున్నాం. నూనె పట్టే క్రమంలో వచ్చే పల్లిపిండి, నువ్వుల పిండిని వినియోగదారుడు వదులుకుంటే ఆయిల్ పట్టినందుకు డబ్బులు తీసుకోవడం లేదు. ఏడాదిగా మంచి లాభాలే వస్తున్నయ్. ఇదే ప్రధాన వృత్తిగా మారింది’ అని భాగ్య సంతోషంగా చెబుతున్నది.
నా పేరు భారతపు శ్యామల. మాది జాబితాపూర్. ఇద్దరు ఆడపిల్లలు. నాకు వంటలు చేసుడంటే ఇష్టం ఉండేది. కానీ, పద్దెనిమిదేండ్ల పాటు బీడీలు చేసిన. అవి బంద్ చేసి ధనలక్ష్మి స్వశక్తి మహిళ సంఘం సభ్యురాలిగా చేరిన. కొన్ని రోజుల్లోనే వీవో అయిన. ప్రభుత్వం రుణం ఇస్తుందని, ఏదైనా వ్యాపారం చేసుకోమని ఏపీఎం ఓదెల గంగాధర్ సార్ చెప్తే మొదట్లో పట్టించుకోలే. మూడేండ్ల కింద ఏపీఏం సార్ సూచన మేరకు శివరాత్రి పండుగప్పుడు తినుబండారాలను తయారు చేసి స్టాల్ పెట్టాలని సూచించినా ఎవరూ ముందుకురాలే. ఏదైతే అది కాని అని నేను వేములవాడలో నాలుగు రోజుల పాటు లడ్డు, బాదుషాలు చేసి విక్రయించిన.
పెద్దగా లాభం రాలే. అయితే, నేను తయారు చేసిన స్వీట్లకు గుర్తింపు వచ్చింది. తర్వాత ధర్మపురి జాతరలో స్టాల్ ఏర్పాటు చేఇసన. అక్కడ మంచి లాభాలు వచ్చినయ్. దీంతో తినుబండారాల తయారీ కేంద్రం పెట్టాలని భావించిన. ఏపీఎం సార్ని అడిగితే లోన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చిన్రు. 30 శాతం రాయితీతో 70 శాతం రుణం చెల్లించే పద్ధతిలో 5 లక్షల రుణం మంజూరైంది. వీటితో జగిత్యాల-పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై జాబితాపూర్లో ధనలక్ష్మి పిండివంటల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన.
పెద్ద గ్రైండర్, పిండి గిర్నీ, ఆయిల్ క్లీనింగ్ మిషన్, బోంది, ఖార, తదితర పదార్థాలను ప్యాకింగ్ చేసే మిషన్లను కొన్న. నిర్వహణ కోసం ఫుడ్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకున్న. ఆర్నెళ్ల నుంచి పిండివంటల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న. లడ్డు, బాదుషా, రవ్వలడ్డు, మెంతి లడ్డూ తయారీలో కరీంనగర్ డెయిరీ నెయ్యిని వినియోగిస్తున్న. ఇంకా బోంది, ఖారా, అరిసెలు, చకిణాలు, గారెలు, గరిజెలు తయరు చేసి విక్రయిస్తున్న. స్థానికంగా ఉండే మెడికల్ కాలేజీ హాస్టల్స్, మైనార్టీ హాస్టల్స్, నర్సింగ్ కాలేజీ హాస్టల్స్ వాళ్లు తీసుకెళ్తున్నరు. సాధారణ జనాలకు సైతం గోంగూర, మామిడి, చికెన్, చేపల పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నం. కిలో చికెన్ పచ్చడికి రూ.వెయ్యి చార్జ్ చేస్తున్నం. మిగిలినవన్నీ సాధారణ ధరలోనే ఉన్నయి. అమెరికా, సౌదీ, దుబాయి వంటి ప్రాంతాలకు వెళ్లేవారు తీసుకెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడిప్పుడే లాభాలు వస్తున్నయ్. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాలని ఉంది.
స్వశక్తి మహిళా సంఘాల సభ్యుల దృక్కోణంలో మార్పు వచ్చింది. గతంలో డబ్బులు పొదుపు చేసి, రుణాలు తీసుకొని అధిక వడ్డీకి ఇవ్వడానికే ఇష్టపడేవారు. అయితే, దీనివల్ల సంఘాలకు పెద్దగా లాభం రాకపోయేది. కానీ, ఇప్పుడు పొదుపు చేసిన డబ్బులతోపాటు, ప్రభుత్వం ఇచ్చే రుణాలను వినియోగించుకొని చిన్నచిన్న తయారీ, ఉపాధి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. దీంతో ఉపాధిని స్వయంగా పొందడంతోపాటు, ఇతరులకు పని చూపించే స్థాయికి వస్తున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చాలా మంది కుటీర పరిశ్రమలు స్థాపించుకున్నారు. ఒక్క జగిత్యాల మండలంలోనే ఇరవైకి పైగా యూనిట్లు పనిచేస్తుండగా, లక్ష్మీపూర్, జాబితాపూర్లోని పదికిపైగా ఉన్నాయి. 30 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తున్నాం. బ్యాంకులు సైతం సహకరిస్తున్నాయి.
– ఓదెల గంగాధర్, ఏపీఎం, జగిత్యాల రూరల్ మండలం