మంటపుట్టిస్తున్న నిత్యావసర రేట్లతో భగ్గుమంటున్న మహిళాలోకం, తాజాగా గ్యాస్ ధరల పెంపుపై మండిపడుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు పేదల కడుపు కొడుతున్నదని, నెత్తిన బండ వేసిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని బతికే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇక కట్టెలపొయ్యే దిక్కైందని మండిపడుతున్నది. బీజేపీతో వెలుగులు వస్తాయని అనుకుంటే చీకట్లలోకి నెట్టేసిందని ఇంటింటా ప్రతి ఏ ఆడబిడ్డా భగ్గుమంటున్నది. బీదోళ్లమైన మా బతుకుల మీద ఇంత బరువేసిన బీజేపోళ్లకు వచ్చే ఎన్నికల్ల ఓటుతో గట్టిగ బుద్ధి చెప్తామని స్పష్టం చేసింది.
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎలా బతికేది?
ఈ చిత్రంలో వంట చేస్తూ కనిపిస్తున్న మహిళ పేరు అనుమాసు పద్మ. మధ్యతరగతి కుటుంబం. కరీంనగర్లోని భగత్నగర్లో నివాసం. ప్రతి రెండున్నర నెలలకు ఒక గృహావసర గ్యాస్ సిలిండర్ను ఆమె వినియోగిస్తున్నది. 14.5 కిలోల సిలిండర్ ధర 2021 మార్చిలో 861.50 ఉన్నదని, 2022 మార్చిలో 952కు చేరిందని, ఇప్పుడేమో ఏకంగా 1,175 అయిందని చెబుతున్నది. ఒక్క గ్యాస్ సిలిండర్పై రెండేళ్లలో సుమారు 315 పెంచడంపై ఆగ్రహిస్తున్నది. పద్మలాగే ప్రతి సామాన్య, మధ్య తరగతి కుటుంబం మండిపడుతున్నది. ఏడాదిలో 12 గృహావసరాల సిలిండర్లకు సబ్సిడీపై ఇస్తామని చెప్పిన కేంద్రం అది కూడా భారీగా తగ్గించిందని, ఇచ్చే 40 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎలా బతుకుతరని ప్రశ్నిస్తున్నారు.
ధరలు దించేదాకా ఆందోళన
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ ధరను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నది. సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నది. పేదల ప్రభుత్వమని చెబుతూనే పేదల నడ్డి విరుస్తున్నది. గ్యాస్ ధరల పెంపుతో పేదల ఇంట్లో మంట పెడుతున్నది. గతంలో 500 లోపు ఉన్న సిలిండర్ రేటును ఇప్పుడు ఏకంగా 1175 చేసి ఆగం చేసింది. గ్యాస్ ధరను మూడు రేట్లు చేయడమే బీజేపీ ప్రజలకు ఇచ్చే భరోసానా? మోదీ మన్కీ బాత్ అంటే నిత్యావసరాల రేట్లు పెంచి ప్రజలను గోసపెట్టడమా? ఈ విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ఇంటింటికీ వెళ్లి కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. ధరలు దించేదాకా ఆందోళనలు చేయాలి.
– కరీంనగర్ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
మోయలేని భారం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊ అంటే సిలిండర్ ధరలు పెంచుతుంది. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరుస్తున్నది. మోయలేని భారం వేసింది. గ్యాస్పై వంట చేసుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇక నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయా..? అంటే అవీ భగ్గుమంటున్నాయి. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు ఎలా బతుకుతాయి. వాళ్లే ఆలోచించాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి.
– తలారి నాగమణి, గృహిణి (రాయికల్)
మాలాంటోళ్లు బతికేదెట్ల?
ఇప్పటికే నిత్యావసర ధరల పెంపుతో చిరు వ్యాపారాలు కొనసాగించడం కష్టంగా మారింది. దీనికి తోడు మరోసారి వంట గ్యాస్ ధరలు పెంచి ఒకసారిగా మా నడ్డి విరిచారు. కమర్షియల్ సిలిండర్ ధరను అమాంతం 350 పెంచింది. 1769 ఉన్న వాణిజ్య సిలిండర్ ధర 2119కు చేరింది. మేం హోటల్ మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నో మాటలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పేదల పొట్టగొడుతున్నది. ఇది చాలా బాధాకరం. ధరలు వెంటనే తగ్గించాలి.
– మహమ్మద్ ఖలీల్ హుస్సేన్, నైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు, (హుజూరాబాద్ టౌన్)
వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతం
కేంద్రంలోని బీజేపీ పెద్దలు పేదల కడుపుకొడుతున్నరు. గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతూ నడ్డి విరుస్తున్నరు. చిన్నా చితక పనులు చేసుకుని బతికే మేం ఇలాంటి భగ్గుమనే ధరలతో ఎలా బతుకుతం? ఇది మాలాంటి మధ్యతరగతి కుటుంబాల గ్యాస్ వాడకుండా అడ్డుపడ్డట్లే అవుతుంది. చమురు కంపెనీల రేట్లు పెరగకపోయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యం ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచడం ప్రజలపై మోయలేని భారం వేయడమే. బీజేపీ అధికారంలో ఉంటే ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. అందుకే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతం.
– వకుళాభరణం వకుల, గృహిణి గ్యాస్గోదాం ఏరియా (హుజురాబాద్టౌన్)
ఇక పొయ్యిలే దిక్కు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలమీద పగబట్టింది. గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి..? ఇలా అయితే మేం ఎలా బతుకుతాం. ఈ ధరల మోత చూస్తుంటే కట్టెలపొయ్యిమీద వంట చేసుకోవడమే నయం అనిపిస్తోంది. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈ రోజు రూ.1155కు పెంచిన్రు. బీజేపీ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో అర్థంకావడం లేదు. ఇప్పటికైనా మా మధ్యతరగతి కుటుంబాల బాధలు తెలుసుకొని పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి.
– వడ్లకొండ లక్ష్మి, గృహిణి (చొప్పదండి)
ధరలు తగ్గించాలి..
ఈ సిలిండర్ ధరలు భరించలేపోతున్నం. అసలే పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబం గడుసుడే కష్టమైతుంది. ఇప్పుడు గ్యాస్ ధరలతో కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తం. చిన్నప్పుడు గ్యాస్ సిలిండర్లు పేలిన వార్తలు విన్నం. కానీ ఇప్పుడు సిలిండర్ను వెలిగించకుండానే ధరలతో పేలిపోతుంది. వెంటనే పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలి.
– ఎనగంటి మౌనిక, జగిత్యాల
ధరలు దించకుంటే వారినే దించుతం
దేశంల వేటి ధరలు పెరిగినా మిడిల్ క్లాస్కే ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పటికే నూనె ధరలు, నిత్యావసరాల ధరలు చూస్తే భయమేస్తున్నది. గతంలో ఎప్పుడో ఓసారి గ్యాస్ ధరలు పెరిగేటివి. ఇపుడు నెలకోసారి, రెన్నెళ్లకోసారి పెంచుతున్నరు. కేంద్ర ప్రభుత్వానికి ఇదేమైనా న్యాయమైతదా..? పెంచిన రేట్లు తగ్గించకుంటే ఈ ప్రభుత్వాన్నే అధికారం నుంచి దించుతం.
– సుతారి అనిత, గృహిణి, రామంచంద్రాపూర్ కాలనీ (కరీంనగర్)