ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల విత్డ్రా
చివరి వరకూ ఉత్కంఠగా ప్రక్రియ
పోటీలో 10 మంది అభ్యర్థులు
అందులో ఇద్దరు టీఆర్ఎస్
మిగతా వారంతా స్వతంత్రులే
కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఈ ప్రక్రియ చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగింది. చివరి రోజు 14 మంది నామినేషన్లను విత్డ్రా చేసుకోగా, బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించకపోగా.. ఇక ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు, ఎనిమిది మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి నిమిషంలో అభ్యర్థులు వచ్చి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఈ నెల 24న జరిగిన పరిశీలనలో వివిధ కారణాలతో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. 24మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. గురువారం నుంచే నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉన్నా ఆ రోజు ఎవరూ ముందుకు రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఒక్కో అభ్యర్థి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండగా కొందరు చివరి నిమిషంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లడంతో వారి అభ్యర్థనను రిటర్నిం గ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆమోదించారు. ఉదయం 11 గంటల నుంచి ఒక్కొక్క అభ్యర్థి వచ్చి తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. అప్పటివరకు ఒకరిద్దరు మాత్రమే ఉపసంహరించుకోగా ఆఖరి అరగంటలో 10 మందికి పైగా అభ్యర్థులు ఉపసంహరణకు వెళ్లారు. మొత్తంగా 24 మందిలో 14 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 10 మంది మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు..
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన పది మంది వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ నుంచి ఎలగందుల రమణ, తానిపర్తి భానుప్రసాద్ రావు పోటీలో ఉన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాగంపేటకు చెందిన ఆరె రాజేందర్, పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని భగత్నగర్కు చెందిన ఎనుముల సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల జోగిరెడ్డి, జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారానికి చెందిన కొల్లూరి గంగాధర్, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెంది న మాసర్తి రమేశ్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నంకు చెందిన మునిగాల విజయలక్ష్మి, కరీంనగర్లోని సిక్వాడీకి చెందిన సర్దార్ రవీందర్ సింగ్, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు..
నామినేషన్లు ఉపసంహరించుకున్నది వీరే..
నామినేషన్లు ఉప సంహరించుకున్న 14 మంది వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీనగర్కు చెందిన అన్నారం శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా కొత్తపల్లికి చెందిన సరాలపు సత్తయ్య, భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారానికి చెందిన బందం వసంత్రెడ్డి, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారానికి చెందిన చాంద్పాషా మహ్మద్, పెద్దపల్లి జిల్లా చేకుర్తికి చెందిన మ్యాకల శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులకు చెందిన మాదాసు వేణు, ఇదే మండలంలోని జోగాపూర్కు చెందిన మ్యాకల గణేశ్, కరీంనగర్లోని రాంనగర్కు చెందిన గంగాధర శంకరయ్య, ఇదే జిల్లాలోని చొప్పదండి పట్టణానికి చెందిన చీకట్ల రాజశేఖర్, ఇదే పట్టణంలోని రాంనగర్కు చెందిన నలుమాచు రామకృష్ణ, మాడం తిరుపతి, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్కు చెందిన పూసాల తిరుపతి, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటకు చెందిన పురం రాజేశం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు..
చివరి నిమిషం వరకు..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు చివరి నిమిషం వరకు అధికారులు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉండగా ఉదయం నుంచి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎన్నికల పరిశీలకులు టీ విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్నారు. నామినేషన్ విత్డ్రాకు వచ్చిన ప్రతి అభ్యర్థి నామినేషన్ పత్రాలు, సంతకాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నామినేషన్ విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. చివరి నిమిషంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అడుగు పెట్టిన ఇద్దరు అభ్యర్థులకు కూడా అధికారులు అవకాశం కల్పించారు.