రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ):మంత్రి కేటీఆర్ చొరవతో పారిశ్రామిక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ హ బ్గా అభివృద్ధి చెందుతున్న సిరిసిల్లలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత బడ్టెట్ హోటల్ రూపుదిద్దుకుంటున్నది. ఫిబ్రవరిలో ప్రారంభమైన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రగుడు నుంచి వెంకటాపూర్కు వెళ్లే ప్రధా న రహదారి అయిన రెండో బైపాస్ రోడ్డులోని మెడికల్ కళాశాలకు ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించింది.
రూ.18 కోట్లతో నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్లో ఆధునిక హంగులతో టూస్టార్ హోటల్ను తలపించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జీ ప్లస్ వన్ నమూనాలో నిర్మిస్తున్న ఈ భవనంలో మొత్తం 26 గదులు ఉంటాయి. వీవీఐపీల కోసం రెండు ఏసీ సూట్లు, సమావేశాలు నిర్వహించుకునేందుకు కాన్ఫరెన్స్ హాల్, 500 మంది కూర్చుండేలా బంకెట్ హాలు, 50 మంది కూర్చుండి అల్పాహారం, భోజనం చేసేందుకు వీలుగా రెస్టారెంట్ను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
వీటితోపాటు ఇన్ హౌస్ బార్ సౌకర్యం కల్పిస్తున్నారు. అన్ని హంగులతో అతి తక్కువ ధరలకే సౌకర్యాలు లభించే ఈ బడ్జెట్ హోటల్ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే గదుల నిర్మాణం తుదిదశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో రంగులు కూడా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. హోటల్, లాడ్జీలకు వచ్చే వారికి వేరువేరుగా 20 గుంటల్లో పార్కింగ్ స్థలాలుండేలా చర్యలు తీసుకుంటున్నారు.
కార్మిక క్షేత్రానికి మంజూరైన హరిత బడ్జెట్ హోటల్ నిర్మాణం చకచకా సాగుతున్నది. సకల సౌకర్యాలు, అధునాతన హంగులతో రూపుదిద్దుకుంటున్నది. రాష్ట్ర టూరిజం శాఖ పర్యవేక్షణలో రూ.18 కోట్లతో నిర్మిస్తున్న ఈ హోటల్ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటవుతున్నది. దీని కోసం రగుడు నుంచి వెంకటాపూర్ వెళ్లే రెండో బైపాస్రోడ్డులో మెడికల్ కళాశాల ఎదురుగా రెండెకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కాగా, భవనంలో రెస్టారెంట్, ఇన్ హౌస్ బార్, బంకెట్హాల్, వీవీఐపీల కోసం ప్రత్యేక గదులు సరసమైన ధరలకే లభించనుండగా, త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నది.
కార్మిక క్షేత్రానికి కొత్తదనం
జిల్లా ఆవిర్భావంతో సిరిసిల్ల పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యాటక శాఖ నిర్మిస్తున్న హరిత బడ్జెట్ హోటల్లో కొత్తదనం సంతరించుకోబోతున్నది. వివిధ వ్యాపారాల రీత్యా జిల్లాకు వచ్చి పోయే వ్యాపారులుకు బడ్జెట్ హోటల్ ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఇన్నాళ్లూ సరైన సౌకర్యాలు లేక వ్యాపారులంతా కరీంగనర్, హైదరాబాద్కు వెళ్తుండేవారు. ఈ హోటల్ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండనుండడంతోపాటు తక్కువ ధరలకే సౌకర్యాలు లభించనున్నాయి.
మెడికల్ కాలేజీ, అప్పారెల్ పార్కు, వీవింగ్ పార్కులున్న చోట హోటల్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాంత వాసులతో పాటు కామారెడ్డి, కరీంనగర్ వైపుల వెళ్లే వందఫీట్ల రహదారి పక్కనే ఉన్నందున భారీ వాహనాదారులకు సైతం బడ్జెట్ హోటల్ ఉపయోగకరంగా ఉండనుంది. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని బడ్జెట్ హోటల్ మంజూరీ చేయించినందుకు కార్మిక క్షేత్ర ప్రజల్లో హర్షం వ్యక్త మవుతున్నది.