జ్యోతినగర్, సెప్టెంబర్ 15: సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా దూసుకుపోతోందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ లక్ష్మీనరసింహ గార్డెన్లో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
కాంగ్రెస్ రాష్ర్టానికి చేసిందేమీ లేదని, బీజేపీ దేశానికి భారంగా మిగిలిందని దుయ్యబట్టారు. ఇక తెలంగాణను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దేశంలో ఏ రంగంలోనైనా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, బీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా తయారు చేసినట్లు తెలిపారు. రామగుండం నియోజకవర్గం తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్కు అండగా నిలబడిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే చందర్ను భారీ మెజార్టీతో గెలిపించారని, మళ్లీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చందర్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేపడుతున్న దుష్ప్రచారాన్ని గులాబీ సైనికులు తిప్పికొట్టాలని సూచించారు. కాంగ్రెస్ పదేండ్ల కాలంలో పది వేల ఉద్యోగాలు ఇస్తే, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో రెండు లక్షల 22వేల ఉద్యోగాలను సృష్టించి అందించారన్నారు. ఐటీలో నాలుగు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. ఐటీకి కేరాఫ్గా హైదరాబాద్, వ్యవసాయానికి కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. అంతకుముందు పవర్హౌజ్ నుంచి లక్ష్మీనరసింహాగార్డెన్ వరకు పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ తీశారు.
నా జీవితం ప్రజాసేవకే అంకింతం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నా. నా జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించండి. రామగుండం గెలుపును సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వండి. మంత్రి కొప్పుల ఈశ్వర్ శిష్యరికంతోనే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి కోసంఎంతటి త్యాగానికైనా సిద్ధం.
క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల ఎదుగుదలకు సహకరిస్తుంది. ప్రజాసంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఒక కార్యకర్తగా ఉన్న తనను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయడం పార్టీ విధివిధానాలకు నిదర్శనం.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే