కలెక్టరేట్, అక్టోబర్ 3: గతంలో భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, ఆ జంటలోని భాగస్వామికి కష్టాలు మొదలయ్యేవి. తిరిగి పెన్షన్ రాక, కన్నవారు పట్టించుకోక నానా బాధలు తప్పకపోయేవి. అటు భాగస్వామి మరణం, ఇటు తన పోషణ తనకే భారమై ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండేవారు. ఇరుగు పొరుగు ఆదరించినా కొద్ది రోజుల పాటు మాత్రమే కాగా, సమస్యల సాలెగూటి నుంచి తప్పించుకోలేక ఇంటి పెద్ద మరణించిన కొద్ది రోజులకే ఆ కుటుంబంలో ఉండే రెండో పెద్దమనిషి కూడా మంచాన పడడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్ నిబంధనల్లో మార్పులు చేశారు.
ఏవోపీ పెన్షన్ పొందుతున్న వృద్ధులు మరణిస్తే వెంటనే వారి భాగస్వాములకు దానిని బదలాయించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పదిహేను రోజుల్లో భాగస్వామి పేరిట బ్యాంకులో డబ్బులు జమ చేయాలని సూచించారు. అయితే వృద్ధాప్యం లేకుంటే వితంతు పింఛన్ మంజూరు చేయాలంటూ సూచించడంతో, ఏడాది కాలంగా జిల్లాలోని వృద్ధ దంపతుల్లో ధీమా వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పెన్షన్ కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగి, తిరిగి వేసారే పరిస్థితులు మారిపోయాయి. పెన్షన్దారు మరణించిన విషయం గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి సమాచార అందిస్తే చాలు, మిగతా తంతు అంతా ఆయనే చూసుకునేలా నిబంధనల్లో మార్పులు చేశారు. మరణించిన పెన్షన్దారు ఇంటికి వెళ్లి భాగస్వామి ఆధార్కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్ సేకరించి, మరణ ధ్రువీకరణ పత్రం కూడా సిద్ధం చేసి, వీటిని మండల పరిషత్ కార్యాలయానికి కూడా పంపే బాధ్యతలు కార్యదర్శికే అప్పగించారు.
దీంతో, వారం రోజుల్లో పూర్తి వివరాలను మండల పరిషత్ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపుతారు. అక్కడ అధికారులు పరిశీలించి సత్వరమే భాగస్వామికి పెన్షన్ మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పదిహేను రోజుల్లోనే ముగిసి, తదుపరి నెల నుంచి ఖాతాలో జమ అవుతుండగా, కోడళ్లు, కూతుళ్లు, కొడుకులు తమ ఆలనాపాలన చూసుకుంటారో లేదోననే మనోవేదన నుంచి దూరమవుతున్నారు. భాగస్వామి మరణంతో తమ జీవనం ముందుకు సాగుడెట్లా అనే బాధ నుంచి విముక్తి కల్పిస్తూ, మంజూరైన పెన్షన్ భరోసా ఇస్తుండగా ఆయా కుటుంబాల్లోని లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత తొమ్మిది నెలల నుంచి ఈ విధానం జిల్లాలో అమలవుతుండగా, ఇప్పటి వరకు 892 మంది భాగస్వాములు మరణించిన వారికి పింఛన్ మంజూరు చేసినట్లు డీఆర్డీవో అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్ పొందుతున్న వృద్ధుల భాగస్వాములకు సత్వరమే పెన్షన్ మంజూరు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలి. అర్హులు దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లో పింఛన్ మంజూరు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
-ఎల్ శ్రీలత, డీఆర్డీవో