410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి
224 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం
మాడల్ కాలనీగా హౌసింగ్బోర్డు కాలనీ
తొలగిన విద్యుత్ వైర్ల సమస్య
ఆహ్లాదంగా మారిన సర్కస్ గ్రౌండ్
116 కోట్లతో మిషన్ భగీరథ.. నగరంలో రోజు మంచినీటి సరఫరా
నగరంలోని ప్రధాన రహదారులన్నీ 100 ఫీట్ల వెడల్పుతో విస్తరణ
615.22కోట్లతో రోడ్ల నిర్మాణం
2 కోట్లతో చామన్పల్లిలో పీహెచ్సీ
దుర్శేడ్, చెర్లభూత్కూర్ సింగిల్ విండోలకు గోదాం
కరీంనగర్ నియోజకవర్గం.. స్వరాష్ట్రంలో టాప్గేర్లో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, మంత్రి గంగుల కమలాకర్ కృషితో ప్రగతికి కేరాఫ్లా నిలుస్తున్నది. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఊహించని మార్పు కనిపిస్తున్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాలన చేరువైంది. ఇంటింటికీ సంక్షేమం దరిచేరింది. అభివృద్ధి కూడా అదే స్థాయిలు పరుగులు తీసింది. ప్రతి గ్రామానికీ బీటీ రోడ్లు వేయగా, కేవలం 15 నిమిషాల్లో ఏ ప్రాంతం నుంచైనా జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం కలిగింది. ఇక కరీంనగర్ అయితే రాష్ట్రంలోనే రెండో గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటున్నది. నగరంలోని రహదారులన్నీ అద్దంలా మెరిసిపోతుండగా, ప్రధానంగా ఇండ్లపై ఉన్న లూజ్ లైన్ల సమస్య పరిష్కారమైంది. రాష్ట్రంలో ఏ నగర పాలక సంస్థలో లేని విధంగా నిత్యం తాగునీరు సరఫరా చేస్తుండగా, దశాబ్దాల గోస తీరింది. మరోవైపు పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయస్థాయి హంగులతో మానేరు రివర్ ఫ్రంట్ రూపుదిద్దుకుంటుండగా, ఇప్పటికే పూర్తయిన కేబుల్బ్రిడ్జి మణిహారంగా మారింది.
కార్పొరేషన్, మార్చి 17 : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నది. సమైక్య పాలనలో కరీంనగర్ బల్దియాతో పాటు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని గ్రామాలు అభివృద్ధి జాడలేక కునారిల్లేవి. గుంతల దారులతో పల్లెజనం రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు పడేది. జిల్లాకేంద్రంలోని లింకురోడ్లు, ప్రధాన రహదారులు అడుగడుగునా గుంతలతో నగరజనం నరకం అనుభవించేది. ట్రాఫిక్ చిక్కులతో అష్టకష్టాలు పడేది. తలాపునే మానేరు ఉన్నా తాగునీటికి మున్సిపల్ ట్యాంకరే దిక్కయ్యేది. ఇటు పల్లెల్లోనూ గుక్కెడు నీటి కోసం అరిగోసపడేది. పూడిక నిండి వట్టిపోయిన చెరువులతో సాగునీటికి బోరుబావులే ఆధారమయ్యేది. కానీ స్వపరిపాలనలో కరీంనగర్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా కరీం‘నగరం’ రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించే విధంగా మానేరు రివర్ ఫ్రంట్ అన్ని హంగులతో ముస్తాబవుతున్నది. ఐటీ టవర్తో స్థానిక యువత ఉపాధికి చింతలేకుండా ఉన్నది. జిల్లాకేంద్రంతో పాటు అన్ని గ్రామాలకు సుందరమైన బీటీ రోడ్లు నిర్మితమయ్యాయి. కేవలం 15 నిమిషాల్లో నియోజకవర్గంలోని ఏ ప్రాంతం నుంచి అయినా నగరానికి చేరుకునే విధంగా రోడ్లు అభివృద్ధి చెందాయి. వరదకాలువ నుంచి ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేయటంతో కొత్తపల్లి మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరు అందుతుండగా కరీంనగర్ రూరల్ మండలంలో చెక్ డ్యాం నిర్మాణంతో నీటి సమస్యలు తీరాయి.
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోకి కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలు వస్తాయి. ఆయా గ్రామాల్లో ఏళ్ల తరబడిగా పెండింగ్ ఉన్న సమస్యలు స్వరాష్ట్రంలో పరిష్కారానికి నోచుకున్నాయి. ప్రధానంగా అన్ని గ్రామాల రోడ్లు అద్దాల్లా మారాయి. 615.22కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు 508కోట్లు వెచ్చించి 1,408 కిమీల మేర కొత్తరోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు చేపట్టారు. కరీంనగర్ నుంచి ఒద్యారం వరకు ఇటీవలే 88 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణమైంది. 30 లక్షల వ్యయంతో కొత్తపల్లి మండల పరిధిలో వరదకాలువకు మూడు ప్రాంతాల్లో తూములను సరైన ఎత్తులో నిర్మించడంతో నాగులమల్యాల, బద్దిపల్లి చెరువులు నిండుతున్నాయి. నాడు బద్దిపల్లిలో వానకాలంలో రోడ్లపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయేవి. 1.25 కోట్లతో కల్వర్టు నిర్మించి, రోడ్డు విస్తరించడంతో సమస్య పరిష్కారమైంది. కరీంనగర్ రూరల్ మండలంలో మొగ్దుంపూర్, ఇరుకుల్ల, గోపాల్పూర్, నగునూర్, బొమ్మకల్ గ్రామాల్లో 6 కోట్లతో చెక్డ్యాంలను నిర్మించారు. దీంతో సుమారుగా 6 వేల ఎకరాలకు నీరందుతుండగా, ఇటు భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యలు దూరమయ్యాయి.
కరీంనగర్ నుంచి మానకొండూర్ వెళ్లే పాత రహదారిలోని మానేరు నదిపై 224 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 147 కోట్లతో కేబుల్బ్రిడ్జి నిర్మించగా, మిగిలిన నిధులతో అప్రోచ్ రోడ్లు, ఇతర పనులు చేస్తున్నారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్డు పనులు తుది దశకు చేరగా, కేబుల్ బ్రిడ్జిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు 6.50 కోట్లతో డైనమిక్ లైట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ దూరం నుంచి కూడా సృష్టంగా కనిపించే విధంగా జర్మన్ టెక్నాలజీతో 45 వేల పిక్సెల్స్, 65 వేల కలర్స్తో ఉండే డైనమిక్ లైట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బ్రిడ్జి పైన 10/30 సైజులో బ్రిడ్జికి రెండు వైపులా నాలుగు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా చిన్నపాటి లైవ్షోలు, మెస్సేజ్ బిట్స్ను ప్రదర్శించవచ్చు.
ఉమ్మడి పాలనలో అధ్వానంగా ఉన్న కరీం‘నగరం’, నేడు స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. స్థానిక మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో నగరం తన రూపుమార్చుకున్నది. ఎన్నడూ లేని విధంగా వందల కోట్ల నిధులతో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. ఇప్పటికే నగరంలోని 14.5 కిలోమీటర్ల ప్రధాన రోడ్లన్నీ 100 ఫీట్ల మేరకు విస్తరించి సుందరంగా మెరిసిపోతున్నాయి. వీటితోపాటు అన్ని లింకు రోడ్లూ అభివృద్ధికి నోచుకున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తొలి పర్యటనలోనే కరీంనగర రోడ్ల అభివృద్దికి 110 కోట్ల నిధుల జీవోను జారీ చేశారు. వీటితో పాటుగా 350 కోట్ల సీఎం అస్యూరెన్స్ నిధులు మంజూరు చేశారు. సుమారుగా 600 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు మరోవైపు అనేక ప్రాజెక్టులను తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఐటీ టవర్ ఏర్పాటుతోపాటు మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటయ్యాయి. 3.5 కోట్ల వ్యయంతో అన్ని ప్రాంతాల్లోనూ 30కి పైగా మాడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. అలాగే 3 కోట్ల వ్యయంతో 35 ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్, 2.75 కోట్లతో 12 ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం చేశారు. సుమారుగా 12 కోట్లతో 13 చౌరస్తాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 12 కోట్ల వ్యయంతో 14 పార్కు స్థలాల్లో సుందరీకరణ పనులు పూర్తి చేశారు. 25 కోట్లతో వైకుంఠధామాలను అభివృద్ధి చేశారు. దీంతో కరీంనగరం రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్నది.
నాడు మానేరు డ్యాం పక్కనే ఉన్నా నగరవాసులు తాగునీటికి తండ్లాడేవారు. ఎండకాలంలో డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టగానే అరిగోసపడేవారు. కనీసం ‘మా నీటిని వరంగల్కు నీటిని పంపించద్దు’ అంటూ నాటి ప్రజాప్రతినిధులు ఆందోళనలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రోజు విడిచి రోజు కూడా నీటి సరఫరా ఉండకపోయేది. కానీ, స్వరాష్ట్రంలో ఆ దాహం తీరింది. సీఎం కేసీఆర్ చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ కింద కరీంనగర్ నగరపాలక సంస్థ రోజూ నీటి సరఫరా కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. 116 కోట్లతో ఎల్ఎండీ నుంచి రా వాటర్ తీసుకోవడం, ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం, కొత్తగా శాతవాహన యూనివర్సిటీలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం, అక్కడి నుంచి సహజ పద్ధతిలో నగరంలో వివిధ రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు సుమారుగా 45 కిలోమీటర్ల మేరకు నూతన పైపులైన్లు కూడా వేశారు. ప్రతి రోజూ అన్ని డివిజన్లు, కాలనీల్లోనూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోనే తాగునీరు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ నగరపాలక సంస్థలో లేని విధంగా కరీంనగర్లో మాత్రమే ప్రజలకు రోజూ తాగునీరు సరఫరా చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా వాసులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల కల ఈ ఏడాది నెరవేరింది. కొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలోని తెలంగాణ విత్తనోత్పత్తి సంస్థకు చెందిన గోదాముల్లో తాత్కాలికంగా తరగతి గదుల నిర్మాణానికి రూ. 7 కోట్లుతో పనులు సాగుతున్నాయి. ప్రధాన ప్రభుత్వ దవాఖానలో టీ హబ్ను ఏర్పాటు చేసి 57 రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం 350 పడకలకే పరిమితమైన ప్రధాన దవాఖాన ఇపుడు 500 పడకలకు అప్గ్రేడ్ చేశారు. అలాగే నగరంలో నూతనంగా మూడు పీహెచ్సీ, రెండు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ రూరల్లోనూ నూతనంగా చామన్పల్లిలో ఒక పీహెచ్సీని ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలో అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా అంతే స్థాయిలో సాగుతున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఒక్కొక్కరికి లక్షా నూటాపదహార్ల సాయం అందుతున్నది. 2017 నుంచి ఇప్పటి వరకు 8,572 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. నియోజకవర్గంలో రెండు విడుతల్లో 868 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. ఇప్పటికే కొత్తపల్లి మండలం కమాన్పూర్లో 68, ఎలగందులలో మరో 20, ఖాజీపూర్లో 20, కరీంనగర్ మండలం మొగ్దుంపూర్లో మరో 40 ఇండ్ల చొప్పున మొత్తం 148 ఇండ్లను మంత్రి గంగుల కమలాకర్ గృహ ప్రవేశాలు చేయించారు. కరీంనగర్ అర్బన్కు సంబంధించి చింతకుంటలోని గాంధీనగర్లో నిర్మాణమవుతున్న 660 డబుల్ బెడ్రూం ఇండ్లు తుది మెరుగులు అద్దుకుంటున్నాయి. రెండు మండలాలకు సంబంధించి మరో 60 ఇండ్లు కూడా తుది దశలో ఉన్నాయి. ఆసరా కింద 36,994 మందికి 8.10 కోట్ల పింఛన్లు ప్రతి నెలా అందుతున్నాయి. రైతుబంధు కింద ఇప్పటి వరకు 123.55 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రైతుబీమా కింద 211 మంది రైతులు చనిపోగా 203 మందికి 10.15 కోట్ల పరిహారం చెల్లించారు. సీఎంఆర్ఎఫ్ కింద 4,667 మందికి 16.80 కోట్లు ఆర్థిక సహాయం అందించారు. కేసీఆర్ కిట్ కింద 6,502 మందికి లబ్ధి చేకూర్చారు.
నగరంలో ప్రతి రోజు మంచినీటి సరఫరా అందించడంతో పాటు అతి త్వరలోనే నగరవ్యాప్తంగా 24 గంటల మంచినీటి సరఫరా అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని హౌసింగ్బోర్డు, రాంపూర్, భగత్నగర్ రిజర్వాయర్ల పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరాకు సంబంధించి పైలెట్ ప్రాజెక్టు కింద కసరత్తులు సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే హౌసింగ్బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలో మంచినీటి పైపులైన్ పనులతో పాటుగా, 24 గంటల నీరు అందిస్తే వచ్చే సమస్యలపై కూడా సమీక్షలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో మొట్టమొదటగా 24గంటలు మంచినీరు అందించేందుకు అన్ని ఏర్పాట్లూ శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే వర్షాకాలంలో ఈ నీటిని అందించే దిశగా పనులు సాగిస్తున్నారు.
గతంలో నగరానికి వచ్చే ఏ ప్రధాన రహదారిని చూసినా చీమ్మ చీకట్లుగానే దర్శనమిచ్చేది. కానీ, నేడు నగరానికి నలువైపులా అన్ని ప్రధాన రహదారులు సెంట్రల్ లైటింగ్తో వెలుగులు చిమ్ముతున్నాయి. నగరపాలక సంస్థ, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) సంయుక్త ఆధ్వర్యంలో నగరానికి వచ్చే హైదరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల రోడ్ల అన్నింటిల్లోనూ పెద్ద ఎత్తున సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. 7.75 కోట్లతో నలువైపులా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రోడ్డులో అల్గునూర్ బ్రిడ్జి నుంచి నగర పరిధి వరకు, పెద్దపల్లి, మంచిర్యాల రోడ్డుల్లోనూ నగర పరిధి వరకు, ఇటు రేకుర్తి వరకు, అలాగే పద్మనగర్ నుంచి ఒద్యారం వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కాంతులు వెదజల్లుతున్నాయి. దీంతో పాటు ఎన్టీఆర్ విగ్రహం నుంచి పద్మనగర్ చౌరస్తా వరకు ఉన్న బైపాస్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి బొమ్మకల్ వరకు పెద్దపల్లి బైపాస్ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ను అద్భుతంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు డ్యాం కట్టపైనా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామాల్లోనూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలలు అరకొర వసతులతోనే నడిచేవి. కానీ, స్వరాష్ట్రంలో కార్పొరేట్కు దీటుగా తయారయ్యాయి. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో కరీంనగర్ నియోజకవర్గంలో రెండు బాలికల, మూడు బాలుర మైనార్టీ గురుకులను ఏర్పాటు చేశారు. ఒక్కటి చొప్పున జ్యోతిబాపూలే, ఎస్సీ, ఎస్టీ డిగ్రీ, పీజీ కళాశాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తంగా 77 ప్రభుత్వ పాఠశాలు ఉండగా, అందులో మెరుగైన సదుపాయాలు కల్పించారు. ‘మన ఊరు-మన బడి’ కింద నగునూర్, చింతకుంట ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు. అలాగే కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో 14 పాఠశాలల్లో ఆధునీకరన పనులు చేస్తున్నారు. నగరంలోని 52 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్సిటీ కింద 52 స్మార్ట్ తరగతులను ఏర్పాటు చేసి బోధన చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మొదటిసారి నియోజకవర్గంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అగ్రికల్చర్ మహిళా డిగ్రీ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు.
సమైక్య రాష్ట్రంలో లూజ్ వైర్ల సమస్య తీవ్రంగా ఉండేది. నగరంలో ఇండ్లపై నుంచే హైటెన్షన్ వైర్లు వేలాడేవి. వీటిని తొలగించాలని ఏండ్ల తరబడిగా వేడుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కానీ, స్వరాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారమైంది. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించి, ఇండ్లపై విద్యుత్ వైర్లు అనేవి లేకుండా చేసే ఉద్దేశ్యంతో కార్యాచరణ మొదలుపెట్టారు. అధికారులతో సమీక్షించిన అనంతరం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారు. దాంతో సమస్యను పరిష్కరించారు. అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా 540 విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు. దాంతో నగరంలో అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వైర్ల సమస్యలు లేకుండా పోయాయి. అలాగే నియోజకవర్గ పరిధిలో ఆరు 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో సబ్స్టేషన్ల సంఖ్య 21కి చేరింది. అలాగే ఇటీవలే మరో రెండు నూతన సబ్ సేష్టన్ల నిర్మాణాలకు కూడా మంత్రి భూమిపూజ చేశారు. అలాగే దుర్శేడ్లో 132కేవీ సబ్సేష్టన్లు రెండు ఉండగా, మరొకటి పద్మనగర్లో ఏర్పాటు చేసేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి.
నగరానికి ఆనుకొని ఉన్న మానేరు నదిపై 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో నీటి పారుదల శాఖ నుంచి 310 కోట్లు, పర్యాటక శాఖ నుంచి 100 కోట్లు కేటాయించారు. మొదటి విడుత డ్యాం గేట్ల నుంచి నాలుగు కిలోమీటర్ల మేరకు నదికిరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి 310.46 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు తుది దశకు వచ్చాయి. ఈ వాల్స్ పూర్తయిన తర్వాత మరో ఎత్తులో వాల్స్ నిర్మాణం చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా తీరొక్క పార్కులు, బోటింగ్, క్రీడా కోర్టులు, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ తదితర వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఆధునిక హంగులతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగరానికి గుర్తింపు తెచ్చేలా ప్రపంచంలోనే మూడోది, దేశంలోనే మొదటిదైన బిగ్ వాటర్ ఫౌంటేన్ను 69 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫౌంటెన్లో వాటర్ జెట్స్, ఫైయిర్ జెట్స్, లేజర్ షోతో పాటుగా నీటిధారతో ఏర్పడే వాటర్ ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంటాయి. ఈ స్రీన్పై లఘుచిత్రాలను అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరం వరకు స్పష్టంగా చూడచ్చు.
నాడు తాగు, సాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డం. స్వరాష్ట్రంలో అనేక గ్రామాల్లో వాగులపై చెక్డ్యాంల నిర్మాణంతో నీళ్ల గోస తప్పింది. బావులు, బోర్లల్లో నీళ్లు ఉబికివచ్చినయ్. ఎండకాలంలోనూ కాలువలు నిండుగా పారుతున్నయ్. కరెంట్ గూడా ఫుల్లుగా ఉంటున్నది. మా ఊరిలో రోడ్లను బాగా అభివృద్ధి చేసిన్రు. తీగలగుట్టపల్లి నుంచి నగునూర్ పాత రోడ్డు నిర్మాణంతో కరీంనగర్కు వెళ్లేందుకు దూరం తగ్గింది. పల్లెల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పంట గింజలను ఇబ్బందిలేకుండా అమ్ముకుంటున్నం.
– దామెరపల్లి రాజిరెడ్డి, నగునూర్
మానేరులో మా ఊరు మునిగిపోవడంతో తాహెర్ కొండాపూర్లో పునరావాసం కల్పించిన్రు. అయితే ఊరికి రోడ్డులేక మస్తు ఇబ్బందులు పడ్డం. చిన్న చినుకుపడ్డా మట్టి రోడ్డు బురదగా మారేది. తెలంగాణ ప్రభుత్వం 1.25 కోట్లతో చెర్లబూత్కూర్ పెద్ద చెరువు కట్ట మీదుగా మా ఊరికి వరకు రోడ్డు వేసిన్రు. అక్కడే ఉన్న కాలువపై 65 లక్షలతో కల్వర్టు నిర్మించిన్రు. వరదలకు కాలువ పొంగితే బహుదూ ర్ఖాన్పేట, చాకుంట, చామనపల్లి, లేదంటే సుల్తానాబాద్ మండలంలోని ఐత్రాజ్ పల్లి, దుబ్బపల్లి మీదుగా ప్రశాంత్నగర్ చెర్లబూత్కూర్కు చేరుకోవాల్సి వచ్చేది. కల్వర్టు నిర్మాణంతో దూర భారం తప్పింది.
– గోస్కుల అశోక్ (తాహెర్ కొండాపూర్)
గతంలో రోడ్లపై అడుగడుగునా గుంతలు పడడంతో రాకపోకల కోసం నరకం అనుభవించినం. తెలంగాణ వచ్చినంక నగరంలోని ప్రధాన రోడ్లను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దిన్రు. మధ్యలో డివైడర్లు అందులో పచ్చని చెట్లు, ఇరువైపుల పుట్పాత్వేయడంతో అద్భుతంగా కనిపిస్తున్నయ్. గతంలో ట్రాఫిక్తో అనేక అవస్థలు పడ్డం. ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు తీరినయ్. అలాగే ఇతర లింకు రోడ్లు కూడా సీసీతో నిర్మించిన్రు. ఇంతకుముందు రోడ్లపై దుమ్ముధూళితో కండ్లు నిండిపోయేవి. ఇప్పుడు అన్ని రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నరు. ప్రతిరోజూ స్వీపింగ్ చేస్తున్నరు. కాలనీల్లో మురుగుకాల్వలు, రోడ్లును అభివృద్ధి చేస్తున్నరు. ఇప్పుడు కరీంనగర్ గొప్పగా కనిపిస్తుంది.
– కృష్ణ, భగత్నగర్, కరీంనగర్
సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చొరవతో సాగునీరు పుష్కలంగా వస్తున్నది. నాగులమల్యాల శివారు వద్ద రెండు మండలాలకు చెందిన రైతులు సాగునీటి కోసం అరిగోసపడేది. మంత్రి దృష్టికి తీసుకుపోవడంతో 50 లక్షలు వెచ్చించి తూముల నిర్మాణం ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయడంతో అన్ని గ్రామాలకు సాగునీరు అందుతున్నది. మండలంలో బీడు భూములు లేకుండా పోయాయి. పుష్కలమైన సాగునీరు అందుబాటులో ఉండడంతో భూముల విలువలు భారీగా పెరిగాయి. ఇప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నరు.
– పీ కనుకయ్య, నాగులమల్యాల, రైతు
మంత్రి గంగుల కృషితోనే కొత్తపల్లి బాగా అభివృద్ధి చెందింది. అడిగిన వెంటనే నిధులు విడుదల చేయిస్తున్నరు. ఇటీవల మున్సిపల్ పాలకవర్గ సమావేశానికి హాజరైన మంత్రి కొత్తపల్లిలో అభివృద్ధి పనుల కోసం రూ 2 కోట్ల నిధులను మంజూరు చేసిన్రు. ఈ నిధులతో ఒక్కోవార్డులో రూ 15 లక్షలతో పనులు చేపట్టిన్రు. ఈ నెలాఖారులోగా పూర్తి చేయనున్నారు. రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నరు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరగడం సంతోషంగా ఉంది.
-సుంకె సత్యనారాయణ, కొత్తపల్లి