సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన జగిత్యాల నియోజకవర్గం, స్వరాష్ట్రంలో అభివృద్ధి ఖిల్లాగా మారింది. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్ కృషితో దశాబ్దాలనాటి కష్టాలు, కన్నీళ్లను దూరం చేసుకొని ప్రగతి పథాన పయనిస్తున్నది. ఒకవైపు అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతుండగా.. మరోవైపు సంక్షేమం ఇంటింటికీ చేరింది. విద్య, వైద్య పరంగా కొత్త పుంతలు తొక్కగా, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైద్యం మరింత చేరువైంది.
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, జీవనదిలా మారిన వరదకాలువ, రోళ్లవాగు ఆధునీకరణ, మిషన్ కాకతీయతో జలాలు పరవళ్లు తొక్కుతుండగా, సాగు రెండు వందల శాతం పెరిగింది. జగిత్యాల-నిర్మల్ జిల్లాలను కలిపే కలల వారధి అయిన బోర్నపెల్లి వంతెన సైతం రెండేండ్ల క్రితమే ప్రారంభోత్సవం చేసుకోగా, ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించి తొమ్మిదేండ్లలో జగిత్యాల సరికొత్తగా మారింది.
– జగిత్యాల, నవంబర్ 25, (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, నవంబర్ 25, (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గానికి మహర్దశ వచ్చింది. తొమ్మిదేండ్ల వ్యవధిలో జిల్లా కేంద్రంగా ఒక వైపు అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతూనే మరో వైపు నియోజకవర్గం సైతం ప్రగతి పథంలో సాగుతున్నది. నియోజకవర్గంలో జగిత్యాల అర్బన్, రూరల్, సారంగాపూర్, రాయికల్, బీర్పూర్ మండలాలు ఉండగా, అన్ని చోట్ల అభివృద్ధి పరుగులు తీస్తున్నది. జగిత్యాల జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీతోపాటు సూపర్ స్పెషాలిటీ దవాఖాన సైతం సేవలందిస్తున్నది.
నాలుగేండ్ల కింద జిల్లా ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ద్వారా ప్రతి రోజూ 52 మందికి సేవలు అందుతున్నాయి. వీటితోపాటు బస్తీ, పల్లె, మహిళా దవాఖానలు ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యం చేరువైంది. వైద్య రంగంతో పాటు, విద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయి. నియోజకవర్గానికి అత్యంత కీలకమైన దాదాపు 10వేల ఎకరాలకు సాగునీరందించే రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పూర్తయింది. అలాగే జగిత్యాల జిల్లా-నిర్మల్ జిల్లాలను కలిపే కలల వారధి అయిన బోర్నపెల్లి వంతెన సైతం రెండేండ్ల క్రితమే ప్రారంభోత్సవం చేసుకోగా, ఇరు జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగు పడింది.
బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం కోసం గత పాలకులు ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇక్కడి జల వనరుల అభివృద్ధి కోసం అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతో రోళ్లవాగు ప్రాజెక్టు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 0.25 టీఎంసీ స్థాయి నుంచి ఒక టీఎంసీ స్థాయికి పెంచేందుకు, అలాగే ఎస్సారెస్పీ నుంచి ప్రాజెక్టులోకి నీటిని తీసుకువచ్చే డీ53 కాలువను ఆధునీకరించడానికి 136 కోట్లు అవసరం అవుతాయని అప్పుడు అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఆ మేరకు నిధులు ఇవ్వగా, 200 ఎకరాల భూమిని సేకరించి, శరవేగంగా సర్వ హంగులతో రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 25 ఎకరాల సువిశాల స్థలంలో 100 కోట్ల వ్యయంతో సమీకృత కలెక్టరేట్ను నిర్మించారు. వీటితో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, అదనపు కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు పూర్తి చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం 40 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు.
మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు విరివిగా నిధులు మంజూరు చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో 50 కోట్లతో రోడ్ల మధ్య డివైడర్లు, చెట్ల పెంపకం, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ కూడళ్లను అభివృద్ధి చేశారు. అలాగే సెంట్రల్ లైటింగ్ పను లు కూడా పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువును 4.5 కోట్లతో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దారు. వీటితోపాటు కండ్లపెల్లి చెరువు, మోతె చెరువులో బతుకమ్మ ఘాట్ల నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. నాలుగు శ్మశాన వాటికలను అభివృద్ధి చేశారు. పట్టణంలో 100 కిలోమీటర్ల మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణం చేపట్టారు. పట్ట ణ ప్రగతి నిధులు ప్రతి నెలా 35 లక్షలు వస్తుండగా, వీటితో పట్టణంలో 12 ఓపెన్ జిమ్లు, ఆరు చోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు.
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ మండల కేంద్రాన్ని 2018 మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపాలిటీగా మార్చివేశారు. 12 వార్డులతో రాయికల్ మున్సిపల్ పురుడు పోసుకోగా, మంత్రి కేటీఆర్ రూ.25కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేశారు. ఈ నిధులతో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం, రోడ్లు, డివైడర్లు, బైపాస్ రోడ్డు, ఇతర అభివృద్ధి పనులు చేశారు. రెండేండ్లలో 15 కోట్లతో అభివృద్ధి పనులు, ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, 2.66కోట్లతో కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు.
నియోజకవర్గంలో వైద్యం కొత్త పుంతలు తొక్కుతున్నది. జిల్లా కేంద్రంలో 550 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభమైంది. దీంతో పాటు జిల్లా దవాఖానలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడంతో గతంలో ప్రైవేటులో వేలకు వేలు ఖర్చు చేసి కిడ్నీ బాధితులకు ఎంతో మేలు జరుగుతున్నది. అలాగే మాతా శిశు సంరక్షణ కేంద్రం 27 కోట్లతో పూర్తవగా, ప్రస్తుతం గర్భిణులకు వైద్య సేవలు అందుతున్నాయి. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని తారక రామానగర్ కాలనీలో బస్తీ దవఖానాను ఏర్పాటు చేశారు.
గడిచిన నాలుగేండ్ల కాలంలో జిల్లా ప్రధాన దవాఖానలో 22వేల ప్రసవాలు చేశారు. ఒకప్పుడు ప్రసవాలు అంటే ప్రైవేట్ దవాఖానలు అన్న భావన నేడు పోయి, ప్రతి నెలా సగటున 400 ప్రసవాలు చేస్తున్నారు. జిల్లా ప్రధాన దవాఖానలో ప్రస్తుతం వివిధ విభాగాల్లో స్పెషలిస్టులైన 90 మంది వైద్యులు వైద్య సేవలందిస్తున్నారు. పీడియాట్రిక్ సర్జరీలు సైతం జగిత్యాల దవాఖానలోనే చేస్తున్నారు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో నాలుగు గురుకులాల ఏర్పాటు చేశారు. వీటి తో పాటు, ప్రతి మండలంలోనూ మోడల్ స్కూల్ ప్రారంభించారు. జగిత్యాలకు మైనార్టీ బాలికలు, బీసీ బాలుర కళాశాలలు మంజూరయ్యాయి. వీటితో పాటు నియోజకవర్గ పరిధిలో మూడు కస్తూర్బా పాఠశాలలు విద్యనందిస్తున్నాయి. గతంలో మైనార్టీ, బీసీ బాలుర గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకే బోధన చేయగా, గతేడాది నుంచి వీటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశారు. మరో మూడు కస్తూర్బాలను కూడా జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశారు. ‘మన ఊరు -మన బడి’ కింద మొదటి విడుత 64 పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
స్వరాష్ట్రంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులు, యువత మేలు కోసం జగిత్యాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ను మంజూరు చేసింది. 1.30 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో వంద మంది విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యంతో పాటు, నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన బోధన అందిస్తున్నారు. ఇప్పటికే రెండు బ్యాచ్లు విజయవంతంగా ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందాయి. అందులో దాదాపు 40 మంది కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల పరీక్షలకు ఎంపికయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ కృషి ఫలితంగా జగిత్యాలకు బీసీ స్టడీ సర్కిల్ సైతం మంజూరైంది. దీంతో జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో అదనంగా మరో ఎస్సీ స్టడీ సర్కిల్ మంజూరైంది. దీంతో యువత ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది.
హైదరాబాద్ తదుపరి రాష్ట్రంలోనే అత్యధిక డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ నిర్మాణం జగిత్యాల నియోజకవర్గం పరిధిలో జరుగుతున్నది. 2017 లో నిజమాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత జగిత్యాల పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి సీఎం కేసీఆర్ను కలిసి జగిత్యాలకు పెద్ద సంఖ్యలో ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె కృషితో జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రత్యేక నిధుల నుంచి 4,500 ఇండ్లను ఒకే చోట మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూకపెల్లి సమీపంలో 300 కోట్లతో 4500 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. అందులో 3,722 ఇండ్లను ఇప్పటికే పంపిణీ చేశారు. గతంలోనే రాయికల్, సారంగాపూర్, జగిత్యాల మండలం ధరూర్ గ్రామ శివారులో పలువురు లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీని పూర్తి చేశారు.
నియోజకవర్గంలో ఇంటింటికీ సంక్షేమం దరిచేర్చారు. 50 వేల మంది వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్నారు. రైతుబంధు కింద జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో లబ్ధ్ది పొందుతుండగా, నియోజకవర్గం పరిధిలో 48,936 మంది రైతులు 397.98 కోట్ల సాయం పొందారు. ఈ యేడాది ఒక్క యాసంగి సీజన్కు సంబంధించి 42.35 కోట్లు పొందారు. అలాగే 40వేల మంది రైతులు రైతుబీమా పరిధిలో ఉన్నారు. వంద యూనిట్ల లోపు వినియోగం ఉన్న దళిత, గిరిజనుల గృహాలకు, క్షౌరశాలలు, రజకుల దోబీలు, రజకుల ఇస్త్రీ దుకాణాలకు సంబంధించి 250 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉచితంగా అందిస్తుండగా, వేలాది మంది ప్రయోజనం పొందుతున్నారు.
నియోజకవర్గంలో 450 లాండ్రీ షాపులు, 340 మంది ఇస్త్రీ దుకాణాదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రెండువేల మంది దళిత, గిరిజన కుటుంబాలు ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ కింద 2018 నుంచి ఇప్పటి వరకు 5.900 మందికి 11.20 కోట్ల ఆర్థిక సాయం అందించారు. రెండువేల మంది నిరుపేదలకు నిమ్స్ దవాఖానలో శస్త్రచికిత్సలకు ఎల్ఓసీలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంపిణీ చేశారు.