హైదరాబాద్లోని జేబీఎస్ నుంచి శామీర్పేట మధ్య డబుల్ డెకర్ స్కైవే నిర్మాణంతో ఏడు జిల్లాల ప్రజలకు ప్రయాణం సాఫీగా సాగనున్నది. 18.5 కిలోమీటర్ల పొడవుతో మూడంచెల పద్ధతిలో ఈ స్కైవే నిర్మించేందుకు మార్గం సుగమం అవుతున్నది. ఇది పూర్తయితే ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల ప్రజలు రాజధానికి సులువుగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. దీనిపై ఇటీవల రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, రంజిత్రెడ్డితో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలుపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్-శామీర్పేట మధ్య ప్రయాణం నరకంగా మారిన సంగతి తెలిసిందే. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే.. శామీర్పేట నుంచి ఉన్న సింగిల్ రోడ్డుపై నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. నిజానికి హైదరాబాద్కు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే దారుల్లో ఇప్పటికే మూడువైపులా ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. రహదారి ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ, శామీర్పేట మీదుగా హైదరాబాద్ వెళ్లే దారిలో మాత్రం ఫ్లైఓవర్ లేక నరకం చూడాల్సి వస్తున్నది. ఈ రహదారి వెంట ఫ్లైఓవర్ నిర్మించేందుకు రక్షణ శాఖ భూములు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ కేంద్రానికి చాలా సార్లు విజ్ఞప్తులు చేసింది. అందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, రంజిత్రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో చర్చలు జరిపారు.
ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ నగరానికి చేరుకునే క్రమంలో శామీర్పేట నుంచి జేబీఎస్ వరకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నదని, దీనిని అధిగమించేందుకు హకీంపేట-బొల్లారం- అల్వాల్- తిరుమలగిరి- కార్ఖానా-జింఖానా గ్రౌండ్ మధ్యలో కంటోన్మెంట్ స్థలంలో రోడ్డును విస్తరించి ఫ్లై ఓవర్ వంతెన అవసరమని, ఈ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు వినోద్కుమార్ వివరించారు. అయితే కంటోన్మెంట్ రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోదీతోపాటు కేంద్ర రక్షణ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసిన విషయాన్ని తాను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ సమావేశాల్లో పలుసార్లు ప్రస్తావించినట్టు రాజ్నాథ్సింగ్కు గుర్తు చేశారు. హైదరాబాద్ ఎంట్రెన్స్ హకీంపేట నుంచి ప్రారంభమయ్యే ట్రాఫిక్ సమస్య బొల్లారం, అల్వాల్, లోతుకుంట, లాల్ బజార్, తిరుమలగిరి, కార్ఖానా, జేబీఎస్, జింఖానా గ్రౌండ్ మధ్య కొనసాగుతున్నదని, దీని వల్ల ఏడు జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సాఫీగా హైదరాబాద్ వెళ్లేందుకు కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రిని కోరారు. ఆ మేరకు కేంద్ర అధికారులు రాష్ట్ర హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించి డబుల్ డెకర్ సైవే నిర్మాణ పనులకు అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించే అంశంపై చర్చలు జరుపుతున్నారని వినోద్ కుమార్ తెలిపారు. తాము జరిపిన చర్చల ఫలితంగా ఈ ప్రతిపాదనలు కొలికి వచ్చాయని, త్వరలోనే సైవే నిర్మాణానికి శ్రీకారం చుడుతారని చెప్పారు.ఇక కరీంనగర్ ప్రయాణానికి మహర్దశ కలుగుతుందని చెప్పారు.
త్వరలోనే కొలిక్కి వస్తుంది..
హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ జిల్లాకు వెళ్లే దారిలో అంబర్పేట 6వ నంబర్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. మెహదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్ సహా మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లేందుకు పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వెళ్లేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవుతున్నది. సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు ట్రాఫిక్ నుంచి బయటపడి ప్రయాణం సాఫీగా సాగించేందుకు మాత్రం ప్రత్యేకంగా మరో దారి లేదు. హైదరాబాద్ ఎంట్రెన్స్ వరకు చేసే ప్రయాణం ఒక ఎత్తయితే, శామీర్పేట నుంచి హైదరాబాద్ నగరంలోకి చేరుకోవడం మరో ఎత్తు అవుతున్నది.
హైదరాబాద్ చేరుకునేందుకు శామీర్పేట-హకీంపేట-బొల్లారం-అల్వాల్-కార్ఖానా-తిరుమలగిరి-జింఖానా గ్రౌండ్ మీదుగా డబుల్ డెకర్ సై వే నిర్మాణం ఒకటే పరిషార మార్గం. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఈ విషయమై కేంద్ర అధికారులు రాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే కొలిక్కి వస్తుంది. డబుల్ డెకర్ సైవే మూడంచెల పద్ధతిలో నిర్మాణమవుతుంది. పై భాగంలో మెట్రో రైలు, మధ్యలో ఫ్లై ఓవర్, కింది భాగంలో రోడ్డు ఉంటుంది. ఈ పనులు పూర్తయ్యే నాటికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నాం. కరీంనగర్ మార్గంలో హైదరాబాద్ నుంచి శామీర్పేట వరకు 18.5 కిలోమీటర్ల మేర నిర్మించే డబుల్ డెకర్ సైవేతో ఏడు జిల్లాల ప్రజలు హైదరాబాద్కు సాఫీగా రాకపోకలు సాగించవచ్చు.
– బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు