కరీంనగర్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ)/కార్పొరేషన్ : ఉమ్మడి రాష్ట్రంలో గతంలో గుంతలమయమైన రోడ్లు, నిండిన మురుగు కాల్వలతో అస్తవ్యస్తంగా ఉన్న కరీం‘నగరం’ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రూ.వందల కోట్ల నిధులతో అభివృద్ధి సాగుతుండడం, సుందరీకరణ విషయంలో స్థానిక మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో నగరం తన రూపు రేఖలను మార్చుకున్నది. ఇప్పటికే నగరంలోని 14.5 కిలోమీటర్ల ప్రధాన రోడ్లన్నీ 100 ఫీట్ల మేరకు విస్తరణకు నోచుకోవడమే కాకుండా, సుందరంగా మారాయి. వీటితో పాటు నగరంలోని అన్ని లింకు రోడ్లుకూడా అభివృద్ధికి నోచుకున్నాయి.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొలిసారిగా కరీంనగర్లో పర్యటించిన సందర్భంగా నగరరోడ్ల అభివృద్ధికి రూ.110 కోట్ల నిధులు మంజూరు చేశారు. వీటితోపాటు రూ.350 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధులు మంజూరయ్యాయి. నగరంలో సుమారు రూ.600 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. నగరంలో మంచినీటి సరఫరా, రోడ్లు, మురుగుకాల్వల అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేకంగా పనులు చేపట్టారు. రూ.3.5 కోట్ల వ్యయంతో అన్ని ప్రాంతాల్లోనూ 30కి పైగా మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. అలాగే రూ.3 కోట్లతో 35 ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్, రూ.2.75 కోట్లతో 12 ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్స్ నిర్మించారు. అలాగే, సుమారు రూ.12 కోట్ల వ్యయంతో నగరంలోని 13 చౌరస్తాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.12 కోట్ల వ్యయంతో నగరంలోని 14 పార్కు స్థలాల్లో సుందరీకరణ పనులు పూర్తి చేశారు. వైకుంఠధామాలను రూ.25 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు.
కరీంనగర్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఇప్పటికే ప్రారంభమై 30 శాతానికిపైగా పూర్తయ్యాయి. రూ.410 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ స్థాయి గుర్తింపు రానుంది. ఎల్ఎండీ డ్యాం గేట్ల నుంచి నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో బోటింగ్, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్స్పోర్ట్స్, పౌంటేన్లు, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ప్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగ్లు, స్పోర్ట్స్ ఎన్క్లేవ్, టెన్నిస్, వాలీబాల్ కోర్టులు, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, తదితర వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు. ప్రపంచంలోనే మూడోది, దేశంలోనే మొదటిదైన బిగ్ ఓ వాటర్ ఫౌంటేన్ను మానేరు రివర్ ఫ్రంట్లో రూ.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వాటర్ జెట్స్, ఫయిర్ జెట్స్, లేజర్ షోతోపాటు నీటిధారతో ఏర్పడే ప్రొజెక్టర్ ఉంటాయి.
కరీంనగర్ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ మెయిన్ రోడ్డును కలిసే పాత రహదారిలో మానేరుపై రూ.224 కోట్ల వ్యయంతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.147 కోట్లతో కేబుల్బ్రిడ్జి, మిగతా నిధులతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేశారు. కేబుల్ బ్రిడ్జిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.6.50 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరం నుంచి కూడా సృష్టంగా కనిపించే విధంగా జర్మన్ టెక్నాలజీతో 45 వేల పిక్సల్స్ 65 వేల కలర్స్తో ఉండే డైనమిక్ లైట్స్ను ఏర్పాటు చేశారు. అలాగే, బ్రిడ్జి పైన 10/30 సైజులో బ్రిడ్జికి రెండు వైపులా నాలుగు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ కింద నగరంలో రూ.116 కోట్లతో పనులు చేపట్టారు. సుమారు 45 కిలోమీటర్ల మేరకు నూతన పైపులైన్లు వేశారు. ఇప్పుడు అన్ని డివిజన్లు, కాలనీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోనే మంచినీటి సరఫరా జరుగుతోంది. త్వరలో 24 గంటల పాటు మంచి నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కరీంనగర్లో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల చిరకాల కల నెరవేరింది. మంత్రి గంగుల చేసిన కృషి ఫలితంగా సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడం, అన్ని అనుమతులతో ప్రస్తుతం తరగతులు ప్రారంభం కావడం చక చకా జరిగిపోయాయి. కొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలోని తెలంగాణ విత్తనోత్పత్తి సంస్థకు చెందిన గోదాముల్లో రూ.7 కోట్లతో తాత్కాలిక తరగతి గదులను ఏర్పాటు చేశారు. రూ.100 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం పనులు సాగుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో టీ హబ్ను ఏర్పాటు చేసి 57 రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం 350 పడకలకే పరిమితమైన ఈ దవాఖానను ఇప్పుడు 600 పడకలకు అప్గ్రేడ్ చేశారు. అలాగే, నగరంలో కొత్తగా మూడు పీహెచ్సీ, రెండు బస్తీ దావాఖనలను ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ కింద ఒక్కొక్కరికి ఇప్పటి వరకు 8,572 మందికి రూ.1,00,116 చొప్పున ఆర్థిక సహాయం అందింది. రెండు విడతల్లో 868 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరవగా, ఇప్పటికే కొత్తపల్లి మండలం కమాన్పూర్లో 68, ఎలగందులలో 20, ఖాజీపూర్లో 20, కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్లో 40 ఇండ్ల చొప్పున మొత్తం 148 ఇండ్లను మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. కరీంనగర్ అర్బన్కు సంబంధించిన 660 డబుల్ బెడ్రూం ఇండ్లు చింతకుంటలోని గాంధీనగర్లో నిర్మించారు.
రెండు మండలాలకు సంబంధించి మరో 60 ఇండ్లు కూడా తుది దశలో ఉన్నాయి. ఆసరా పథకం కింద 36,994 మందికి రూ.8.10 కోట్ల పింఛన్లు ప్రతి నెలా అందుతున్నాయి. రైతు బంధు కింద నియోజకవర్గానికి ఇప్పటి వరకు రూ.123.55 కోట్ల పెట్టుబడి సహాయం అందింది. 211 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా, 203 మంది కుటుంబాలకు రైతుబీమా కింద రూ.5 లక్షల చొప్పున రూ.10.15 కోట్ల పరిహారం చెల్లించారు. సీఎంఆర్ఎఫ్ పథకం కింద 4,667 మందికి రూ.16.80 కోట్లు ఆర్థికసహాయం అందించారు. కేసీఆర్ కిట్ కింద 6,502 మందికి సహాయాన్ని అందించారు..
నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లోని గ్రామాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తంగా రూ.615.22 కోట్లతో రోడ్లు అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు రూ.508 కోట్లు వెచ్చించి 1,408 కి.మీల మేర కొత్తరోడ్ల నిర్మాణం, పునరుద్దరణ పను లు చేపట్టా రు. కరీంనగర్ నుంచి ఒద్యారం వరకు ఇటీవలే కొత్తగా రూ.88 కోట్లతో నిర్మించిన నాలుగు లైన్ల రోడ్డు వన్నె తెస్తున్నది.
కొత్తపల్లి మండలంలోని అనేక గ్రామాలు సాగు నీరు లేక భూములన్నీ బీళ్లుగా ఉండేవి. గంగాధర మండలం ఆచంపల్లి పరిధిలోని వరదకాలువ నుంచి రూ.30 లక్షలతో మూడు తూములు ఏర్పాటు చేసి గోదావరి జలాలను నాగుల మల్యాల ఊర చెరువులకు మళ్లించారు. అక్కడి నుంచి కమాన్పూర్, కొండాపూర్, ఎలగందుల చెరువులకు నీటిని తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగి భూములన్నీ సస్యశ్యామలంగా మారాయి.
నగరంలో హైటెన్షన్ వైర్ల సమస్య తీవ్రంగా ఉండేది. ఇళ్లపై నుంచి వెళ్లిన ఈ వైర్లను తొలగించాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరమని అధికారులు చెప్పడంతో ఈ సమస్యను గతంలో ఎవరూ పట్టించుకో లేదు. ఈ సమస్యను చాలెంజ్గా తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్ నేరుగా సీఎం కేసీఆర్తో మాట్లాడి ఒప్పించి పెద్ద మొత్తంలో నిధు లు తెచ్చి అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా 540 విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో 33/11 కేవీ సబ్సేష్టన్లు కొత్తగా ఆరింటిని ఏర్పాటు చేశా రు. దీంతో నియోజకవర్గంలో మొత్తంగా 21 సబ్సేష్టన్లు ఏర్పాటయ్యాయి. ఇటీవలే మరో రెండు కొత్త సబ్ సేష్టన్ల నిర్మాణానికి మంత్రి గంగుల భూమిపూజ చేశారు. ఇప్పటికే కరీంనగర్ మండలం దుర్శేడ్లో రెండు 132 కేవీ సబ్సేష్టన్లు ఉండగా పద్మనగర్లో మరొకటి ఏర్పా టు చేసేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి.