అరకొర వసతులతో నెట్టుకొచ్చిన సిరిసిల్ల కుసుమ రామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సరికొత్తగా మారింది. ‘మన ఊరు.. మన బడి’ కింద 12 రకాల మౌలిక వసతులు కల్పించడంతో ఆరు దశాబ్దాల బడికి అపూర్వ శోభ వచ్చింది. తరగతి గదుల్లో సోలార్ వెలుగులు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన, అందుబాటులో అధునాతన ల్యాబ్స్, స్పోర్ట్స్ రూం ఏర్పాటు చేయగా, కార్పొరేట్కు దీటుగా తయారైంది. సరికొత్త శోభను సంతరించుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది.
సిరిసిల్ల, ఫిబ్రవరి 9: ‘మన ఉరు.. మన బడి’ కింద సిరిసిల్ల జిల్లాలోని 511 పాఠశాలల్లో మొదటి విడుతలో 172 పాఠశాలలను ఎంపిక చేయగా, అందులో సిరిసిల్ల శివనగర్లోని కుసుమ రామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఒకటి. 1951లో ప్రారంభమైన ఈ పాఠశాల, 1981లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయింది. అయితే ఇన్నాళ్లూ అరకొర వసతులతో అవస్థలు పడ్డ ఈ బడి, నేడు ‘మన ఊరు.. మన బడి’తో సకల సౌకర్యాల ఒడిగా మారింది. ఈ పాఠశాల ఆధునీకరణకు ప్రభుత్వం 11,54,708 మంజూరు చేసింది. 7,21,591తో ప్రహరీ నిర్మించారు. 3,69,865తో మేజర్, మైనర్ రిపేర్లు చేశారు. 63,252తో విద్యుత్ సౌకర్యం కోసం కల్పించారు. మరో రెండు గేట్లు, ఫ్యాన్లు, టేబుల్స్, మూత్రశాలల రిపేర్, కిచెన్ల మరమ్మతులు, ఎలక్ట్రానిక్ రిపేర్, సున్నం, రంగులు ఇలా ఎన్నో రకాల పనులు చేశారు. మొదటి విడుతలో పనులు పూర్తయిన ఈ పాఠశాలను ఈ నెల ఒకటిన జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళతో కలిసి నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్ రావు ప్రారంభించారు.
పాఠశాలలో మొత్తం 14 తరగతి గదులు ఉండగా, 556 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 25 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. కంప్యూటర్ రూం, ల్యాబ్ గది, స్పార్ట్ గది, తదితర గదులను విద్యార్థులు వినియోగిస్తున్నారు. అధునాతన టెక్నాలజీ కలిగిన నాలుగు స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ బోధన చేస్తున్నారు. గ్రీన్ బోర్డులు, పాఠశాల ఆవరణలో 14 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ కోసం 20 కేడబ్ల్యూ సామర్థ్యమున్న సోలార్ ప్యానెల్స్ను అమర్చి వినియోగంలోకి తెచ్చారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. పాఠశాలలో మొక్కలు నాటారు. గివ్ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో పాఠశాలకు ఆకర్షణీయంగా పెయింట్స్ వేశారు.
డిజిటల్ క్లాసులు చెప్తున్నరు
మేం గవర్నమెంట్ స్కూల్కు పోయినట్లు అనిపించడం లేదు. మంత్రి కేటీఆర్ సార్ మా కోసం మా స్కూల్ను ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా మార్చిండు. బడికి రోజూ రావాలనిపిస్తున్నది. కార్పొరేట్ స్కూల్లో మాదిరి ఇక్కడ మాకు కూడా డిజిటల్ క్లాస్లు చెప్తున్నరు. మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.
– ఎండీ నర్గీస్, ఆరో తరగతి
ఆధునిక వసతులు కల్పిస్తున్నాం
మన ఉరు.. మనబడిలో భాగంగా చేసిన పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నాం. మంత్రి కేటీఆర్ సహకారంతో స్కూళ్లను ఆధునీకంగా తీర్చిదిద్దుతున్నాం. విద్యాశాఖ సహకారంతో మౌలిక వసతుల కల్పిస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో పనులు చివరి దశలో ఉన్నాయి. బడుల రూపు రేఖలు మారుతున్నాయి.
– జీ రాధాకిషన్, డీఈవో (రాజన్న సిరిసిల్ల)
ఆదర్శంగా మారుస్తాం
సీఎం కేసీఆర్ సర్కారు బడుల రూపురేఖలు మారుస్తున్నారు. కార్పొరేట్ తరహాలో వసతులు కల్పిస్తున్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. డిజిటల్ బోధనతో విద్యార్థులు మరింత జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. మంత్రి కేటీఆర్ అందించిన సహకారం, ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఈ పాఠశాలను ఆదర్శంగా మారుస్తాం.
– పరబ్రహ్మం, హెచ్ఎం
కార్పొరేట్ స్థాయి విద్య
మన ఉరు..మనబడితో కార్పొరేట్ విద్య అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మార్ట్ టీవీల ద్వారా విద్యాబోధన చేస్తున్నాం. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో కరెంటు బాధ తప్పింది. పాఠశాలలో వృత్తి విద్య శిక్షకుల నియామకం సంతోషదాయకం. బడికి, డిజిటల్ బోధనకు సహకారం అందించిన మంత్రి కేటీఆర్కు ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు.
– పాకాల శంకర్ గౌడ్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు